One Nation One Election: ఒకే దేశం ఒకే ఎన్నిక... రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ

  • ఏక కాలంలో లోక్ సభ ఎన్నికలతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 
  • రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
  • ఆరు నెలల పాటు దేశవ్యాప్తంగా పర్యటించిన కోవింద్ కమిటీ
  • 18,629 పేజీలతో నివేదిక
Ramnath Kovind committee submits report on One Nation One Election

దేశంలో లోక్ సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న ఉద్దేశంతో ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని మోదీ సర్కారు తెరపైకి తెచ్చింది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 

కోవింద్ కమిటీ ఆరు నెలల పాటు దేశవ్యాప్తంగా పర్యటించి వివిధ రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశమై జమిలి ఎన్నికలపై అభిప్రాయ సేకరణ జరిపింది. తాజాగా 18,629 పేజీల నివేదికను రామ్ నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని చివరి ఐదు ఆర్టికల్స్ ను సవరించాల్సి ఉంటుందని కమిటీ సిఫారసు చేసింది. 

మరోవైపు, జమిలి ఎన్నికలపై జాతీయ లా కమిషన్ కూడా తన నివేదికను రూపొందించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు వీలు కల్పించేలా రాజ్యాంగంలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చాలని లా కమిషన్ సిఫారసు చేయనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News