Konda Vishweshwar Reddy: జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందన

  • జితేందర్ రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని విశ్వాసం వ్యక్తం చేసిన విశ్వేశ్వర్ రెడ్డి
  • ఖమ్మం, హైదరాబాద్ పార్లమెంట్ సీట్లను తాము గెలిచినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్య
  • 12కు పైగా లోక్ సభ సీట్లు గెలుస్తామన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Konda Visweswar Reddy responds on CM Revanth Reddy meeting with Jithender Reddy

తమ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడంపై బీజేపీ చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి తమ పార్టీ నేతను వ్యక్తిగతంగా కలిసి ఉండవచ్చునన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జితేందర్ రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఖమ్మం, హైదరాబాద్ పార్లమెంట్ సీట్లను తాము గెలిచినా ఆశ్చర్యం లేదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాము 12 లోక్ సభ స్థానాలకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సీఏఏ ముస్లింలకు వ్యతిరేకమనేది కేవలం వట్టి ప్రచారమేనని వ్యాఖ్యానించారు. ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా లేరని, చేవెళ్లలో ముస్లింలు అందరూ బీజేపీకే వేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వచ్చేసరికి బీజేపీ తొలి విడత ప్రచారం పూర్తి చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనేది కేవలం ప్రచారమేనని తెలిపారు.

గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పని చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. చేవెళ్ల పరిధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని కీలక నేతలు బీజేపీలో చేరనున్నారని తెలిపారు. దేశ ప్రజలు ప్రధాని మోదీనే నమ్ముతున్నట్లు చెప్పారు. ఏ వర్గాన్ని బీజేపీ.. ఓటు బ్యాంక్‌గా చూడటం లేదన్నారు. చేవెళ్లకు మెట్రో రైలు తీసుకురావటానికి కృషి చేస్తానని తెలిపారు.

More Telugu News