Mannava Mohana Krishna: చంద్రబాబును కలిసిన గుంటూరు వెస్ట్ టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ

  • నేడు రెండో జాబితా ప్రకటించిన టీడీపీ
  • పలు చోట్ల అసంతృప్తి జ్వాలలు 
  • గుంటూరు వెస్ట్ టికెట్ పిడుగురాళ్ల మాధవికి కేటాయింపు
  • మన్నవ మోహనకృష్ణకు నచ్చజెప్పిన చంద్రబాబు
  • ఎమ్మెల్సీ లేదా మేయర్ పదవి హామీ ఇచ్చారన్న మోహనకృష్ణ
Guntur West TDP leader Mannava Mohana Krishna met Chandrababu

ఇవాళ ప్రకటించిన టీడీపీ రెండో జాబితాలో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ టికెట్ ను పిడుగురాళ్ల మాధవికి కేటాయించారు. ఈ నేపథ్యంలో, గుంటూరు పశ్చిమ టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ ఈ సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. 

మన్నవ మోహనకృష్ణ గుంటూరు పశ్చిమ టికెట్ ను ఆశించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మన్నవ మోహనకృష్ణ గత కొన్నాళ్లుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రియాశీలకంగా ఉన్నారు. 

అయితే, తనను కలిసిన మన్నవ మోహనకృష్ణకు చంద్రబాబు పరిస్థితిని వివరించారు. సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని బీసీకి టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని నచ్చజెప్పారు. అనంతరం మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ లేదా మేయర్ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని వెల్లడించారు. గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు.

కాగా, మన్నవ మోహనకృష్ణ టీడీపీ అగ్రనేత, సీనియర్ కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు వీరాభిమానిగా గుర్తింపు పొందారు.

More Telugu News