PV Sindhu: ‘ఆల్ ఇంగ్లండ్ ఓపెన్’ నుంచి స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమణ

  • భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రతిష్ఠాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ 2024’ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించింది.
  • 21-19, 21-11 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలైన స్టార్ షట్లర్
  • 42 నిమిషాల్లో మ్యాచ్ ముగించిన వరల్డ్ నంబర్ 1 చైనా క్రీడాకారిణి అన్‌సే యంగ్
Indian Star shuttler PV Sindhu exits from All England Open 2024

ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2024లో భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు గురువారం త్వరగానే నిష్క్రమించింది. బర్మింగ్‌హామ్‌లోని యుటిలిటా ఎరీనా వేదికగా రౌండ్‌-16 మ్యాచ్‌లో ఓడిపోయింది. చైనాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ షట్లర్ అన్‌సే యంగ్ చేతిలో 21-19, 21-11 తేడాతో వరుస సెట్లలో సింధు ఓటమిపాలయ్యింది. 42 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్‌లో హోరాహోరీగా తలపడిన సింధు.. రెండవ సెట్‌లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. అంతకుముందు రౌండ్‌-32లో జర్మనీకి చెందిన షట్లర్ వోన్నే లీపై సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. 2023 సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన సింధు ఇటీవలే ముగిసిన ప్యారిస్ ఓపెన్ 2024లో క్వార్టర్-ఫైనల్ వరకు చేరుకొని ఫర్వాలేదనిపించింది.

సింధు ఓటమితో ‘ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్’ సింగిల్స్ విభాగంలో ఆశలన్నీ స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌పైనే ఉన్నాయి. రౌండ్‌-16లో నాల్గవ సీడ్ ప్లేయర్ అండర్స్ ఆంటోన్‌పై లక్ష్యసేన్ పోరాడి విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు డబుల్స్‌ విభాగంలో భారత టాప్ జోడీ సాత్విక్‌ - చిరాగ్ జోడి పురుషుల రౌండ్‌-16లో ఇండోనేషియా జంట మహమ్మద్ షోహిబుల్ ఫిక్రి-బగాస్ మౌలానాతో తలపడనుంది. ఇక మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప జోడీ జియాన్-జెంగ్ యూతో పోటీ పడనుంది.

More Telugu News