Sudha Murthy: రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసిన సుధామూర్తి

  • ఉమెన్స్ డే నాడు సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
  • భర్త నారాయణమూర్తి సమక్షంలో నేడు పదవీప్రమాణం చేసిన సుధామూర్తి
  • కార్యక్రమాన్ని నిర్వహించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్ 
Sudha Murthy takes oath as Rajya Sabha member

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అర్ధాంగి, ప్రముఖ వితరణశీలి, రచయిత సుధామూర్తి (73) ఇవాళ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆమెను ఇటీవల ఉమెన్స్ డే (మార్చి 8) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే. 

ఇవాళ తన భర్త నారాయణమూర్తి సమక్షంలో సుధామూర్తి ప్రమాణం చేశారు. పార్లమెంటు హౌస్ లోని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ చాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది. సుధామూరి ప్రమాణస్వీకారం సందర్భంగా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పియూష్ గోయల్ కూడా అక్కడే ఉన్నారు. 

ఇంజినీర్ గా ప్రస్థానం ప్రారంభించి, ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ గానూ వ్యవహరించిన సుధామూర్తి, రచయితగా కన్నడ, ఆంగ్ల భాషల్లో అనేక పుస్తకాలు రచించారు. 

గతంలో ప్రభుత్వ రంగ సంస్థ టెల్కోలో ఇంజినీర్ గా పనిచేసిన సుధామూర్తి... తన భర్త నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ప్రారంభించే సమయంలో ఆమె రూ.10 వేలు సాయంగా అందించారు. ఇప్పుడదే ఇన్ఫోసిస్ కంపెనీ విలువ 80 బిలియన్ డాలర్లకు పైమాటే. 

ఇక, సుధామూర్తి-నారాయణమూర్తి దంపతుల కుమార్తె అక్షత... బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అని తెలిసిందే.

More Telugu News