Khushbu: ఖుష్బూ ‘ముష్టి’ వ్యాఖ్యలపై వివాదం.. 1982 నాటి మురసోలీమారన్ వ్యాఖ్యలను గుర్తు చేసి సమర్థించుకున్న బీజేపీ నాయకురాలు

  • రాష్ట్రంలో వెలుగుచూస్తున్న డ్రగ్స్ కేసులపై ఖుష్బూ నిరసన
  • ప్రభుత్వం మహిళలకు రూ. 1000 ముష్టి వేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు
  • ఖుష్భూ వ్యాఖ్యలపై డీఎంకే మహిళా విభాగం ఆందోళనలు
  • తన వ్యాఖ్యలను సమర్థించుకున్న జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు
Khushbu Sundar calls Tamil Nadus women centric scheme alms

ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు,జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ వివాదంలో చిక్కుకున్నారు. మహిళలకు తమిళనాడు ప్రభుత్వం ప్రతినెల అందిస్తున్న రూ. 1000 ముష్టిగా అభివర్ణించారు. రూ. 2 వేల కోట్ల డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత జాఫర్ సిద్ధిఖీ అరెస్ట్ కావడం, రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు వరుసగా బయటపడుతుండడంపై  ఖుష్బూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వం ముష్టి వేస్తున్నట్టు రూ. 1000 ఇస్తున్నప్పటికీ మహిళలు ఆ పార్టీకి ఓటు వెయ్యొద్దని కోరారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి, టాస్మాక్‌ (మద్యం దుకాణాలు)ను మూసివేయిస్తే అప్పుడు ఈ రూ. 1000 భిక్ష వేయాల్సిన పని ఉండదని అన్నారు. 

ఖుష్బూ వ్యాఖ్యలపై డీఎంకే మహిళా విభాగం ఆందోళనలకు దిగింది. దీంతో ఖుష్బూ ఎక్స్ వేదికగా స్పందిస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. డీఎంకేకు తాను వార్తల్లో నిలవడమే ముఖ్యమని విమర్శించారు. డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించడం కోసమే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్నారు. 1982లో అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ప్రవేశపెట్టిన ఉచిత భోజన పథకాన్ని అప్పటి మంత్రి మురసోలీమారన్ బిచ్చంగా అభివర్ణిస్తే ఒక్కరూ మాట్లాడలేదని, డీఎంకే నేతలు పొన్ముడి, ఈవీ వేలు వంటివారు రాష్ట్రంలో మహిళలు, ప్రజలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News