KCR: ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడే భాష ఇదేనా? నేను అలా మాట్లాడలేదు: కరీంనగర్ సభలో కేసీఆర్

  • ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయారన్న కేసీఆర్
  • ముఖ్యమంత్రిగా ఉండి పండబెట్టి తొక్కుతా... మానవబాంబును అవుతానని అంటారా? అని నిలదీత
  • బండి సంజయ్‌కి, వినోద్ కుమార్‌కు పోలిక లేదని వ్యాఖ్య
  • మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోయాయని... చిల్లర రాజకీయం చేస్తున్నారని విమర్శ
KCR speech in Karimnagar kadanabheri meeting

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండి మాట్లాడే భాష అదేనా? తాను ఉద్యమం సమయంలో మినహా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి పరుషపదాలు ఉపయోగించలేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన కదనభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... కరీంనగర్ పోరాటాల గడ్డ అని... ఈ గడ్డ నుంచే మనం పోరాటం ప్రారంభించామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దనే ఆంక్షలు ఉండేవన్నారు. తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడానన్నారు.

ప్రజలు ఏదో రకంగా మోసపోయే సందర్భాలు ఉంటాయని... ఆ విధంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. రైతుబంధు అడిగితే ఓ మంత్రి చెప్పుతో కొట్టమని చెబుతారని, నీళ్లు, విద్యుత్ గురించి అడిగితే ముఖ్యమంత్రి అయి ఉండి పండబెట్టి తొక్కుతా, మానవ బాంబును అవుతా అని అసహనం ప్రదర్శిస్తున్నారన్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మానవబాంబులం అవుతామని అనవచ్చునా? అని నిలదీశారు. తమకు తిట్లు రాక కాదని... మాట్లాడాలనుకుంటే రేపు ఈ సమయం వరకు మాట్లాడుతానని అన్నారు. తాను కూడా ఇలాంటి మాటలు ఉద్యమం సమయంలో మాత్రమే మాట్లాడానని... ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లు మాత్రం అలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. మీకు ప్రజలు అవకాశమిచ్చారని... మాకంటే కాస్త మంచిగా చేసే ప్రయత్నం చేయాలని సూచించారు. అంతేకానీ పండబెట్టి తొక్కుతామనే మాటలు ఎందుకు? అని ప్రశ్నించారు. తాము 24 గంటలు విద్యుత్ ఇచ్చామన్నారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించి కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాకో నవోదయ పాఠశాలను ఇవ్వని... తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. ఎంపీ బండి సంజయ్ ఇక్కడ ఐదు రూపాయల పని చేశారా? అని నిలదీశారు. బండి సంజయ్‌కి, వినోద్ కుమార్‌కు పోలిక ఉన్నదా? కరీంనగర్ ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఉద్యమం సమయం నుంచి తన వెంటే నిలుస్తున్నారని వినోద్ కుమార్‌పై ప్రశంసలు కురిపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు వచ్చాయన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోయాయని... చిల్లర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బలమే తెలంగాణ బలం... బీఆర్ఎస్ గళమే... తెలంగాణ గళమన్నారు. తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాల్సిందే అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయన్నారు. రైతుబంధును తీసుకువచ్చిందే బీఆర్ఎస్ అన్నారు. తమ హయాంలో 24 గంటల విద్యుత్ ఇచ్చామని, నీళ్లు ఇచ్చామని దీంతో పంటలు బాగా పండాయన్నారు. కానీ ఇప్పుడు మార్చి నెలలోనే పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు.

ఓటు తమాషా కోసం వేయవద్దని... మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే చేశారన్నారు. ఈసారి చూసుకొని ఓటు వేయాలని ప్రజలను కోరారు. మొన్న నన్ను ఇక్కడే నిలబెట్టారు కానీ... గెలిపిస్తే కనుక దేశాన్ని కదిలించేవాడినని అన్నారు. ఒక బ్రేక్ వచ్చిందని... ఇప్పటికైనా మించిపోయిందని లేదని... పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు వేధిస్తున్నారని.. కానీ పోలీసులు అలా చేయడం సరికాదన్నారు. పోలీసులకు రాజకీయాలు వద్దని సూచించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని కుక్కలు ఇలాగే మొరిగినా తాము పట్టించుకోలేదన్నారు. ఒకటి రెండు మినహా అన్ని హామీలను అమలు చేశామని తెలిపారు. ఇంటింటికి నల్లా ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పి.. ఆ హామీని అమలు చేశానన్నారు.

భూమి, ఆకాశం ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్ఎస్ పని అయిపోయిందని కొన్ని బేవార్స్ ఛానల్స్ అంటున్నాయని... కానీ మీరే మా వద్దకు వచ్చి.. మళ్లీ సలాంలు కొడతారన్నారు. ఎవరో ఒకరిద్దరు మన పార్టీ నుంచి పోతే భయపడేది లేదని... పార్టీని వీడుతున్న వారిని ఉద్దేశించి అన్నారు.

More Telugu News