Revanth Reddy: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం... మరిన్ని కీలక నిర్ణయాలు

  • ఆరు గ్యారెంటీల్లో మరికొన్నింటిని అమలు చేయాలని నిర్ణయించిన కేబినెట్
  • మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం
  • ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టులపై విచారణ జరిపించాలని నిర్ణయం
Green signal for New Ration Cards in Telangana

తెలంగాణ కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరికొన్నింటిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై త్వరలో జీవో ఇవ్వనుంది. పైరవీలకు తావులేకుండా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనుంది. మొదటి విడతగా 4 లక్షల 56 వేల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం వడ్డీ లేని రుణాలు, రూ.10 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్ తీర్మానం చేసింది.

16 బీసీ కార్పోరేషన్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. హౌసింగ్ కార్పోరేషన్ పునరుద్ధరణకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. 2008 డీఎస్సీ అభ్యర్థుల ఉద్యోగాలపై కసరత్తుకు నిర్ణయించింది. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయించనుంది. గత ప్రభుత్వం ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంపై విచారణ చేపట్టాలని కేబినెట్ తీర్మానం చేసింది.

జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విచారణ జరపనుంది. రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు నిధులు ఇవ్వనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచన చేయనుంది.

More Telugu News