Chandrababu: చంద్రబాబుపై చార్జిషీట్ దాఖలు చేసిన సీఐడీ

  • అమరావతి భూముల కేసులో కీలక పరిణామం
  • చంద్రబాబు, నారాయణ తదితరులు 1,100 ఎకరాల భూములు కొట్టేశారని ఆరోపణ
  • ఆ భూముల విలువ రూ.4,400 కోట్టు అని వెల్లడి
CID files charge sheet against Chandrababu in Amaravati assigned lands case

అమరావతి అసైన్ మెంట్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుపై నేడు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో రూ.4,400 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు సీఐడీ ఆరోపించింది. ఇందులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా, మాజీ మంత్రి నారాయణ, సుధీర్ బాబు, అంజనీకుమార్ లను ఇతర నిందితులుగా పేర్కొంది. 

రాజధాని నగర ప్లాన్ పేరిట చంద్రబాబు తదితరులు 1,100 ఎకరాల స్థలం కొట్టేశారని సీఐడీ అభియోగాలు మోపింది. అందుకోసం భూ రికార్డులను తారుమారు చేశారని చార్జిషీట్ లో ఆరోపించింది. 

ఈ భూముల కేసు 2020లో మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నమోదైంది. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు, ఇతర మంత్రులు తమ బినామీల సాయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన భూములు చేజిక్కించుకున్నారని సీఐడీ తెలిపింది. వారికి ఎలాంటి ప్యాకేజి చెల్లించలేదని, అతి తక్కువ ధరలకే ఆ భూములను లాగేసుకున్నారని పేర్కొంది. 

నిషిద్ధ జాబితాలో ఉన్న ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు, జీపీఏలు ఇచ్చేందుకు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ వర్గాలపై ఒత్తిడి తీసుకువచ్చారని సీఐడీ అభియోగాలు మోపింది.

More Telugu News