Revanth Reddy: నా ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాదేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నా దగ్గరకు వచ్చి చెబుతున్నారు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • బీజేపీ ఎనిమిది సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అని ప్రశ్న
  • తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్‌లో ఎవరూ మిగలరని వ్యాఖ్య
  • మోదీ, కేడీ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే మేం చూస్తూ ఊరుకుంటామనుకోవద్దని హెచ్చరిక
  • మాకు కూడా లోతు తెలుసు.. ఎత్తు తెలుసు.. పెడితే ఎక్కడకు వెళుతుందో కూడా తెలుసు బిడ్డా... అని వ్యాఖ్య
  • బిడ్డా.. మాతో ఎవరూ గోక్కోవద్దు.. గోక్కుంటే బాగుపడరని హెచ్చరిక
Revanth Reddy shocking comments

అయిదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని... అందుకే మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాదేనని చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలిసి మరీ చెప్పి వెళుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మణుగూరులో కాంగ్రెస్ ప్రజాదీవెన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం ఉండదని బీజేపీ నేత డాక్టర్ కే లక్ష్మణ్ అంటున్నారని... కానీ వారి పార్టీ గెలిచింది ఎనిమిది సీట్లు... వాటితో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు? అని ప్రశ్నించారు. అంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై... కుమ్మక్కై తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోందన్నారు. తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది కలిసి అండగా ఉంటామని చెబుతున్నారని పేర్కొన్నారు. తాను గేట్లు తెరిస్తే కనుక బీఆర్ఎస్‌లో కేసీఆర్, ఆయన కుటుంబం తప్ప మిగతా ఎవరూ పార్టీలో ఉండరని హెచ్చరించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా మనకు మద్దతుగా ఈ సభకు వచ్చారని తెలిపారు.

తాము నీతిమంత రాజకీయాలు చేయాలనుకుంటున్నామని... కానీ మోదీ, కేడీ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే మేం చూస్తూ ఊరుకుంటామనుకోవద్దని హెచ్చరించారు. మాకు కూడా లోతు తెలుసు.. ఎత్తు తెలుసు.. పెడితే ఎక్కడకు వెళుతుందో కూడా తెలుసు బిడ్డా... అల్లాటప్పాగా వచ్చాడని అనుకుంటున్నారేమో... బిడ్డా... నల్లమల నుంచి తొక్కుకుంటూ వచ్చి ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టి నిన్ను బజారుకీడ్చి ఇందిరమ్మ రాజ్యాన్ని... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకు వచ్చామని పేర్కొన్నారు.

బిడ్డా మాతో గోక్కోవద్దని హెచ్చరిక

బిడ్డా.. మాతో ఎవరూ గోక్కోవద్దు.. గోక్కుంటే బాగుపడరని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎక్కడుందో చూడాలంటే మణుగూరుకు వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. మా కార్యకర్తల సప్పుడుకు మీ గుండెలు పగిలి చావాలన్నారు. మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీని 1.50 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీరు ఇచ్చే నినాదాలకు కేసీఆర్ గుండె పగలాలి... మోదీ చెవులు పలగాలన్నారు. కార్యకర్తలు... ప్రజలు తనకు వెయ్యి ఏనుగుల బలం.. మీ అండతో ఎవ్వరు అడ్డు వచ్చినా పండబెట్టే బాధ్యతను తీసుకుంటానన్నారు.

More Telugu News