Indiramma Illu: చుట్టూ ప్రహరీ.. సింగిల్ బెడ్రూం, అటాచ్డ్ వాష్‌రూం.. కిచెన్.. ఇందిరమ్మ ఇల్లు అదిరిపోయిందిగా!

  • నేడు భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్ ప్రారంభం
  • పలు రకాల డిజైన్లతో నమూనాలు సిద్ధం చేసిన ప్రభుత్వం
  • ఏడాదికి రూ. 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రణాళిక
  • తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల మంజూరు
  • హడ్కో నుంచి రూ. 3 వేల కోట్ల నిధుల సేకరణ
Attractive Designs For Indiramma Illu In Telangana Revanth Launches Today

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు భద్రాచలంలో ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు సాయం చేస్తారు. స్థలం లేని వారికి స్థలంతోపాటు రూ. 5 లక్షలు ఇస్తారు. ఏడాది 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రభుత్వం పలు నమూనాలు సిద్ధం చేసింది. ప్రతి డిజైన్‌లోనూ కిచెన్, టాయిలెట్ ఉండేలా తీర్చిదిద్దారు. 

తొలి నమూనాలో సింగిల్ బెడ్రూం, కిచెన్, అటాచ్డ్ వాష్‌రూం, హాల్, కామన్ బాత్రూం, ఇంటిపైకి వెళ్లేందుకు మెట్లు, ఇంటి ముందు మొక్కలు పెంచుకునేందుకు కొంత జాగా, బాల్కనీ, బైక్ పార్కింగ్ కోసం స్థలం, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున మొత్తం 4,16,500 ఇళ్లు మంజూరు చేసింది. మిగతా 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వు కోటా కింద అట్టేపెట్టింది. ఈ పథకం అమలు కోసం హడ్కో నుంచి రూ. 3 వేల కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులతో 95 వేల ఇళ్లు నిర్మించనుంది. గ్రామాల్లో 57 వేలు, పట్టణ ప్రాంతాల్లో 38 వేల ఇళ్లను నిర్మిస్తారు.

More Telugu News