Revanth Reddy: ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు
  • రక్తం చిందించకుండా తెలంగాణ సాధించానని కేసీఆర్ అంటారని వెల్లడి
  • బహుశా ఆయన కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో అంటూ వ్యంగ్యం 
  • తెలంగాణను తామే సాధించామని ఎవరు చెప్పుకున్నా అది అసంబద్ధం అని స్పష్టీకరణ
CM Revanth Reddy held meeting with employees unions

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా సమస్యలు చెప్పుకునే అవకాశం ఉద్యోగులకు రాలేదని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల తరఫున ప్రాతినిధ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. 

ఇక, తెలంగాణను తామే సాధించామని ఏ ఒక్కరు చెప్పుకున్నా అది అసంబద్ధం అని అన్నారు. విద్యార్థి, ఉద్యోగ, కార్మికుల పోరాటంతోనే తెలంగాణ సాకారమైందని వివరించారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించానని కేసీఆర్ అంటారు... బహుశా ఆయన కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో!... కానీ తెలంగాణ కోసం చాలా మంది ప్రాణాలు త్యాగం చేశారు... రక్తం ధారపోశారు అని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. 

తెలంగాణలో ఆదాయం పడిపోయిందని, ఆదాయం కోసం మద్యంపైనే ఆధారపడేలా కేసీఆర్ పాలన సాగిందని విమర్శించారు. తెలంగాణలో నిజాయతీగా పనిచేస్తున్న 95 శాతం ఉద్యోగ సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే... ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. 

శాఖల వారీగా సంఘాలు ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయా సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. 1,100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

కోదండరాం ఎమ్మెల్సీగా ఉంటే శాసనమండలికి గౌరవం అని, గవర్నర్ తో చర్చించి కోదండరాంను మండలికి పంపుతామని తెలిపారు.

More Telugu News