Ramcharan: ఐఎస్‌పీఎల్‌లో ముంబై చేతిలో ఓడిన మెగా హీరో రాంచరణ్ జట్టు

  • ఐఎస్‌పీఎల్‌లో ఫాల్కన్స్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసిన రాంచరణ్
  • నిన్న థానేలో మాఝీ ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి
  • మరింత బలంగా వస్తామంటూ రాంచరణ్ ట్వీట్
  • గెలిచిన ముంబై జట్టుకు అభినందనలు
Ramcharan Responds Over Defeat Falcon Risers Hyderabad Team In ISPL

ఐఎస్‌పీఎల్‌ (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్)లో భాగంగా థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాఝీ ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ప్రముఖ సినీ హీరో రాంచరణ్‌కు చెందిన ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై రాంచరణ్ స్పందించాడు. రెండు జట్లు మైదానంలో హోరాహోరీగా తలపడ్డాయని ప్రశంసించాడు. తర్వాతి మ్యాచ్‌లో బాగా ఆడాలంటూ తన జట్టుకు బెస్టాఫ్ లక్ చెప్పాడు. వచ్చే మ్యాచ్‌కు మరింత బలంగా వస్తామని ధీమా వ్యక్తం చేసిన రాంచరణ్ విజయం సాధించిన మాఝీ ముంబై జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. 

ఐఎస్‌పీఎల్‌లో హైదరాబాద్ జట్టును రాంచరణ్ ఇటీవల కొనుగోలు చేశాడు. ముంబై జట్టుకు అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ జట్టుకు అక్షయ్ కుమార్, బెంగళూరు జట్టుకు హృతిక్ రోషన్ యజమానులుగా ఉన్నారు. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ లీగ్ ఏర్పాటైంది. ఇది టీ10 ఫార్మాట్‌లో జరిగే టెన్నిస్ క్రికెట్ ఇది. ఈ లీగ్ ద్వారా వెలుగుచూసే ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి వారిని సూపర్‌స్టార్లుగా తీర్చిదిద్దుతారు.

More Telugu News