Atchannaidu: జగన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు.. పులివెందులలో ఓటమి ఖాయం : అచ్చెన్నాయుడు

  • వివేకా మర్డర్ కేసు వీడుతుందనే భయంలో జగన్ ఉన్నారన్న అచ్చెన్న
  • భయంతోనే దస్తగిరి తండ్రిపై దాడి చేశారని ఆరోపణ
  • జగన్ పై తిరుగుబాటుకు పులివెందుల ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్య
Jagan is spending slepless nights says Atchennaidu

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. బాబాయ్ వివేకా బాత్రూమ్ మర్డర్ కేసు వీడుతుందనే భయంతోనే దస్తగిరి కుటుంబంపై జగన్ రౌడీలు దాడులు చేస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తండ్రి షేక్ హజీవలిపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గమని అన్నారు. ఓవైపు చెల్లెలు సునీత, మరోవైపు దస్తగిరి వాస్తవాలను బహిర్గతం చేస్తారనే భయంతో జగన్ నిద్రలేని రాత్రులను గడుపుతున్నారని చెప్పారు. జగన్ అకృత్యాలకు, అరాచకాలకు పులివెందులలో కాలం చెల్లిందని అన్నారు. దాడులు, దౌర్జన్యాలతో ప్రజల అభిప్రాయాలను జగన్ మార్చలేరని చెప్పారు.  

పులివెందులను వైఎస్ కుటుంబం శతాబ్దాలుగా శాసించిందని... ఇప్పుడు వివేకా హత్య కేసులో జగన్ ముసుగు తొలగిపోవడంతో... ఆయనపై ప్రజలే తిరుగుబాటుకు రెడీ అయ్యారని అచ్చెన్న అన్నారు. వివేకాను హత్య చేయడానికి గొడ్డలి అందించిన చేయి ఎవరిదో రెండు రోజుల క్రితం దస్తగిరి బయటపెట్టారని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో జగన్ ఫ్యాక్షనిజం, నియంతృత్వ పోకడలు చెల్లవని చెప్పారు. దస్తగరి తండ్రి హజీవలిపై దాడి చేయడంతో పులివెందులలో జగన్ ఓటమి ఖరారయిందని అన్నారు. ఆయనపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని... దస్తగిరి కుటుంబానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 

More Telugu News