Vijayasai Reddy: ఈసారి ఎన్నికలు క్యాస్ట్ వార్ కాదు... క్లాస్ వార్: విజయసాయిరెడ్డి

  • మరికొన్ని వారాల్లో ఏపీలో ఎన్నికలు
  • పెత్తందార్లకు, సీఎం జగన్ కు మధ్య యుద్ధం అని పేర్కొన్న విజయసాయి
  • నెల్లూరు ఎంపీ స్థానం నుంచి బరిలో విజయసాయి 
Vijayasai Reddy describes this elections will be class war rather than caste war

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ నేతలు మాటలకు పదును పెడుతున్నారు. ఏపీలో ఈసారి జరగబోయే ఎన్నికలు కులాల మధ్య పోరు కాదని, వర్గాల మధ్య పోరు అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. 

రాష్ట్రంలో అధికారం అంతా ఒక్కచోటే కేంద్రీకృతమై ఉండాలని కోరుకుంటున్న సంపన్నులకు, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్న సీఎం జగన్ వంటి వారికి మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని అభివర్ణించారు. అధికారం కోసం అర్రులు చాస్తున్న పెత్తందార్లకు... రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా, పేదలు వారి కలలను సాకారం చేసుకునేంతవరకు వారి చేయి విడువరాదని భావించే సీఎం జగన్ కు మధ్య జరుగుతున్న యుద్ధం అని విజయసాయిరెడ్డి వివరించారు.

విజయసాయి ఈసారి నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నెల్లూరు లోక్ సభ స్థానం పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి, కోవూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు నియోజకవర్గాలు ఉన్నాయి. 

ఆయా నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలుస్తూ విజయసాయి ఎన్నికల సన్నాహాలు ముమ్మరం చేశారు. అయితే, నెల్లూరు బరిలో విజయసాయిరెడ్డి 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి టీడీపీ నేతలు అంటున్నారు.

More Telugu News