Chandrababu: అమిత్ షా నివాసానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సంతోషకర ప్రకటన వస్తుందన్న రఘురామకృష్ణరాజు

  • అమిత్ షా నివాసంలో కొనసాగుతున్న భేటీ
  • భేటీ తర్వాత మీడియాతో చంద్రబాబు, పవన్ మాట్లాడే అవకాశం
  • అరగంటలో ప్రకటన వస్తుందన్న రఘురాజు
Chandrababu and Pawan Kalyan meeting with Amit Shah

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లు భేటీ అయ్యారు. అమిత్ నివాసంలో వీరి సమావేశం కొనసాగుతోంది. ఏపీ ఎన్నికల్లో పొత్తు, సీట్ల సర్దుబాట్లపై వీరు చర్చిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీయేలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని నిర్ణయించారు. 

త్వరలో జరగబోయే ఎన్డీయే భేటీకి టీడీపీ, జనసేన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరమని టీడీపీ భావిస్తోంది. జనసేన, బీజేపీ కలిసి 8 లోక్ సభ, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. 

మరోవైపు ఈ భేటీపై ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ... పొత్తుపై మరో 20, 30 నిమిషాల్లో ప్రకటన వస్తుందని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల వాళ్లంతా సంతోషించే ప్రకటన వస్తుందని అన్నారు.

More Telugu News