Navjot Singh Sidhu: కాంగ్రెస్‌లో చేరుతానంటూ పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ నా వద్దకు వచ్చారు.. సిద్దూ సంచలన వ్యాఖ్యలు

  • మీరు బీజేపీవైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయన్న ప్రశ్నకు ఇలా బదులిచ్చిన కాంగ్రెస్ నేత
  • తనకు డిప్యూటీగా ఉండేందుకు మాన్ అంగీకరించారని వెల్లడి
  • సిద్దూ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు స్పందించని పంజాబ్ సీఎం
Bhagwant Mann approached me once to join Congress Navjot Sidhu Revealed in an interview

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌పై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ ఆయన ఒకసారి తనను కలిశారని పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ నుంచి ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా?’ అన్న ప్రశ్నకు సిద్దూ మరోరకంగా బదులిచ్చారు.    

భగవంత్‌మాన్ సాబ్ ఒకసారి తన వద్దకు వచ్చి  కాంగ్రెస్‌లో తనను చేర్చుకుంటే తనకు డిప్యూటీగా ఉండడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని చెప్పారని, అంతేకాకుండా తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినా తనకు డిప్యూటీగా ఉండడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే, తాను రాహుల్, ప్రియాంకగాంధీకి బద్ధుడినై ఉన్నానని, వారిని విడిచిపెట్టి రాలేనని స్పష్టంగా చెప్పేశానని పేర్కొన్నారు. 

ఆయన కనుక కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టయితే అధిష్ఠానంతో మాట్లాడతానని చెప్పానని పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత ఈ విషయంలో ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని వివరించారు. పంజాబ్ ప్రజలకు సేవ చేయడమే తన ఏకైక లక్ష్యమని సిద్దూ పేర్కొన్నారు. ఇదిలావుంచితే, సిద్దూ వ్యాఖ్యలపై మాన్ ఇప్పటి వరకు స్పందించలేదు. 

More Telugu News