Pawan Kalyan: బీసీలు గుడ్డిగా వైసీపీ నేతలను వెనకేసుకొస్తే కులానికి ద్రోహం చేసినవాళ్లవుతారు: పవన్ కల్యాణ్

  • మంగళగిరిలో జయహో బీసీ సభ
  • చంద్రబాబుతో కలిసి బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన పవన్
  • జగన్ నుంచి బీసీలు ప్రాణరక్షణ కోసం చట్టాలు తెచ్చుకోవాల్సి వచ్చిందని వెల్లడి
  • బీసీ కులాల అనైక్యత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన 
Pawan Kalyan speech in Jayaho BC Meeting

మంగళగిరి జయహో బీసీ సభలో చంద్రబాబుతో కలిసి బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. బీసీ డిక్లరేషన్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీలు అన్ని విధాలుగా ఎదగాలనేదే తమ అభిమతం అని స్పష్టం చేశారు. అందుకోసం జనసేన-టీడీపీ కూటమి కృషి చేస్తుందని, ప్రభుత్వంలోకి వచ్చాక డిక్లరేషన్ ను అమలు చేస్తామని చెప్పారు. 

"జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏలూరులో బీసీ గర్జన సభ ఏర్పాటు చేసి చాలా హామీలు ఇచ్చారు. బీసీలకు ఏడాదికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తానని జగన్ చెప్పారు. ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు కేటాయిస్తానని చెప్పారు. వాస్తవానికి వారు కేటాయించింది... సున్నా. 

153 కులాలను గుర్తించాలని బీసీ సంఘాల వారు చెబుతుంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి, చివరికి 53 కార్పొరేషన్లకు తగ్గించారు. ఆ కార్పొరేషన్లకు కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉంది. ఈ దిశగా బడ్జెట్ లో కేటాయింపులు కూడా... సున్నా. వైఎస్సార్ చేయూత కింద 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.75 వేలు అందిస్తామన్నారు. ఈ పథకం అందుకుంటున్న బీసీ మహిళా లబ్దిదారుల్లో చాలా వరకు కోత పడుతోంది. 

శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ అన్నారు... దాని ఊసే లేదు. బడ్జెట్ లో మూడో వంతు బీసీలకేనన్నారు. అది పూర్తిగా విస్మరించారు. 

ఇందాక బీసీ డిక్లరేషన్ లో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చూశాను. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు 23 వేల నుంచి 26 వేల మంది బీసీలపై కేసులు పెట్టారు. 300 మంది బీసీలను చంపేశారు. అచ్చెన్నాయుడు వంటి బీసీ నేతలపై ఎలాంటి దాడులు జరిగాయో అందరూ చూశారు. 

బీసీలు గుడ్డిగా వైసీపీ నాయకులను గనుక వెనుకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసినవారవుతారు. వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. డిక్లరేషన్ లో ఈ పాయింట్  చూడగానే మనస్ఫూర్తిగా మద్దతు తెలిపాను. 

జనసేన పార్టీ పరంగా బీసీలకు సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలకు ఆకర్షితుడ్నయిన వాడ్ని. బీసీలకు సాధికారత ఉండాలి అని కోరుకునే వాడ్ని... బీసీ కులాలు ఇతర కులాలతో సఖ్యతగా ఉండాలి, కేవలం సంఖ్యాబలం ఉన్న బీసీ కులాలే కాకుండా, అల్ప సంఖ్యాక బీసీ కులాలు కూడా అభివృద్ధిలోకి రావాలి... యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీ కులాలు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడ్ని. 

బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి, సంప్రదాయాలకు వెన్నెముక. బీసీ కులాలు లేని సమాజం, బీసీ కులాలు లేని భారతదేశాన్ని మనం ఊహించుకోలేం. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతోంది బీసీ కులాలే. దేవాలయ ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని, హస్తకళలను భాగం చేయాలి, వారిని దేవాలయాల కార్యకలాపాలకు అనుసంధానం చేయాలి, తద్వారా వారిలో ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని చాలామంది బీసీ మేధావులు చెప్పారు. దీన్ని కూడా అమలు చేయాలని నారా చంద్రబబునాయుడు దృష్టికి తీసుకెళుతున్నాను. 

ముఖ్యంగా వడ్డెర కులస్తుల గురించి చెప్పుకోవాలి. బ్రిటీష్ వారి హయాంలో డ్యామ్ ల నిర్మాణాలు, రైల్వే లైన్ల నిర్మాణం అన్నీ వడ్డెర కులస్తుల ద్వారా జరిగేవి. అలాంటి వడ్డెర కులస్తులు నేడు క్వారీ బ్లాస్టింగ్ లలో దెబ్బలు తింటున్నారు. వారు ఏ క్వారీల్లో అయితే రాయిని కొడతారో, ఆ క్వారీలపై వారికి హక్కు లేకుండా పోయింది. జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వడ్డెరలకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలా, క్వారీల్లో సింహభాగం దక్కేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 

వడ్డెరలు కాంట్రాక్టు వ్యవస్థల్లో నలిగిపోతున్నారు. వడ్డెరలు మైనింగ్  ప్రమాదాల్లో చనిపోతే కాంట్రాక్టర్లు మట్టి ఖర్చులు తప్ప ఇంకేమీ అండగా నిలిచే పరిస్థితి లేదు. నేను కర్నూలులో స్వయంగా ఈ పరిస్థితులు చూశాను. 

అంతేకాదు, బీసీ యువత కులవృత్తులపై ఆధారపడి బతకలేని పరిస్థితి ఉంది. వీటన్నింటికి ప్రత్యామ్నాయాలను సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాడ బలిజ, అగ్నికుల క్షత్రియులు, జాలరి, పల్లెకారులు, పల్లెకాపు, గంగపుత్రులు, ముత్తరాసులు వంటి మత్స్యకార కులాలపై ప్రత్యేకమైన దృష్టిని సారించాలి. దాదాపు 794 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నా జెట్టీలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. గంగవరం పోర్టు నేపథ్యంలో పల్లెకారులు, జాలర్లు, మత్స్యకారుల ప్రాణాలు పోయాయి. తిరిగి వాళ్లకు ప్రత్యామ్నాయాలు చూపించడంలో విఫలం అయ్యాం. దీనిపై జనసేన-టీడీపీ ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. 

మత్స్యకారుల పిల్లలు బాల కార్మికులుగా మారిపోయారు. వారి కోసం ప్రత్యేకంగా పాఠశాలలు తీసుకువస్తాం. బీసీల ఆర్థిక అభ్యున్నతికి జనసేన-టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది... బీసీల రక్షణ కోసం మా ప్రాణాలు అడ్డేస్తాం. 153 కులాలుగా ఉన్న బీసీలు ఇవాళ జగన్ నుంచి ప్రాణరక్షణ కోసం చట్టాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే... అది మన అనైక్యత. బీసీల్లో ఐక్యత లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. 

నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నానంటే అందుకు కారణం మన బీసీలు బాగుండాలనే. బీసీల భవిష్యత్తు బాగుండాలి... మున్ముందు కూడా బీసీలకు కూటమి తరఫున జనసేన పార్టీ అండగా ఉంటుంది. 

వెనుకబడిన కులాలకు అండగా నిలిచిన ఎన్టీ  రామారావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను. నిజంగా ఎన్టీఆర్ మహానుభావుడు. అధికారం లేని కులాలకు అధికారం ఇచ్చారు. 80వ దశకంలో రామ్ మనోహర్ లోహియా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లారు. 

జగన్ వచ్చీ రావడంతోనే స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యాన్ని తగ్గించాడు. జనసేన-టీడీపీ ప్రభుత్వం రాగానే దాన్ని 34 శాతానికి పునురుద్ధరిస్తుంది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అంశం కూడా ఈ బీసీ డిక్లరేషన్ లో నాకు బాగా నచ్చింది. ఈ బీసీ డిక్లరేషన్ కు జనసేన మద్దతు ఉంది అని ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నా" అని పవన్ కల్యాణ్ వివరించారు.

More Telugu News