Nara Lokesh: చంద్రబాబుకు, పవన్ అన్నకు మాటిస్తున్నా... మంగళగిరిని గెలిచి మీకు అప్పగిస్తా: నారా లోకేశ్

  • మంగళగిరిలో జయహో బీసీ సభ
  • బీసీలను పేదరికం నుంచి బయటికి తెచ్చిన పార్టీ టీడీపీ అన్న లోకేశ్ 
  • సైకో సీఎం బీసీలకు వెన్నుపోటు పొడిచాడని విమర్శలు
  • మంగళగిరిలో తాను 53 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని లోకేశ్ ధీమా 
Nara Lokesh confidant about his victory in Mangalagiri

బీసీ అంటే భవిష్యత్తు, బీసీ అంటే భరోసా... బీసీ అంటే బలహీనవర్గం కాదు... బలమైన వర్గం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభివర్ణించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో లోకేశ్ ప్రసంగించారు. రూ.3 వేల కోట్ల నిధులతో 4.20 లక్షల మంది బీసీలను పేదరికం నుంచి బయటికి తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. 

ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించి, పనిముట్లు కూడా అందించిన పార్టీ టీడీపీ అని వివరించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిళ్లు, విదేశీ విద్య వంటి పథకాలు తీసుకువచ్చిన జెండా మన పసుపు జెండా అని వెల్లడించారు. చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, కల్లు గీత కార్మికులకు 50 ఏళ్లకు లోపే పెన్షన్లు అందించిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. 

"బీసీల కోసం ఏకంగా మంత్రిత్వ శాఖ ఉండాలని కూడా టీడీపీ తీర్మానం చేసింది. కానీ ఈ సైకో ముఖ్యమంత్రి అయ్యాక బీసీ సోదరులకు వెన్నుపోటు పొడిచాడు. ఆనాడు బీసీలే వెన్నెముక అన్న వ్యక్తి ఇవాళ బీసీ సోదరుల వెన్నెముక విరగ్గొట్టాడు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 16 వేల మందికి పదవులు దూరం చేశాడు. 

ఇవాళ బీసీలకు చెందిన 8 వేల ఎకరాల అసైన్ మెంట్ భూములను వెనక్కి తీసుకున్నారు. ఆదరణ పథకం కూడా రద్దు చేశారు. ఆనాడు ఆదరణ పథకం కోసం బీసీ సోదరులు 10 శాతం డబ్బు కడితే, ఆ డబ్బు నేడు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు... కానీ ఆ కార్పొరేషన్ల చైర్మన్లకు కుర్చీలు కానీ, టేబుళ్లు కానీ ఉన్నాయా? రూ.75 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు తప్పుదారి పట్టించారు.

ఈ సైకో జగన్ జీవో నెం.217 తీసుకువచ్చి మత్స్యకారులకు వెన్నుపోటు పొడిచారు. ఆప్కాబ్ ను నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 300 మంది బీసీలను చంపేశారు. 26 వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు. యనమల రామకృష్ణుడు పెళ్లికి వెళితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయ్యన్నపాత్రుడిపై ఏకంగా రేప్ కేసు పెట్టారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడిపైనా కేసులు పెట్టారు. నిన్న గాక మొన్న నంద్యాల టీడీపీ అధ్యక్షుడిగా రాజశేఖర్ ను నియమిస్తే, ఆ బీసీ నాయకుడిపై ఈ ప్రభుత్వం రౌడీషీట్ తెరిచింది. ఈ ప్రభుత్వానికి ఒక్కటే చెబుతున్నా... మీరు పెట్టే ఎఫ్ఐఆర్ లను మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి. రెండే రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి... జాగ్రత్త!

2019లో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు... రాష్ట్రంలో ఎక్కడ్నించి పోటీ చేస్తావని చంద్రబాబు నన్ను అడిగారు. రాష్ట్రంలో టీడీపీ ఎప్పుడూ గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి... గెలిపించి చూపించే బాధ్యత నాది అని చంద్రబాబుతో చెప్పాను. ఆనాడు నన్ను మంగళగిరి పంపించారు. కేవలం 21 రోజుల ముందే నియోజకవర్గానికి వచ్చాను. అప్పటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాను. 

కానీ, గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మంగళగిరి ప్రజల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఈ పసుపు జెండా చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా 29 సంక్షేమ పథకాలు మంగళగిరిలో చేశాం. మీరు ముందుకు నడవండి మీకు అండగా మేముంటాం అని మంగళగిరి ప్రజలు కొండంత భరోసా ఇచ్చారు. వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. 

ఈ సందర్భంగా చంద్రబాబుకు మంగళగిరి ప్రజల తరఫున కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నా. మొదటిది... కొండ పోరంబోకు, ఫారెస్ట్, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే భూముల్లో మంగళగిరి ప్రజలు దశాబ్దాలుగా ఉంటున్నారు. ఇళ్లు కూడా కట్టుకున్నారు. ఒక తరం కాదు, రెండు తరాలుగా కాదు... మూడు తరాలుగా అక్కడుంటున్నారు. ఆ భూములను క్రమబద్ధీకరించాల్సిన బాధ్యత మనపై ఉంది చంద్రబాబు సర్. 

రెండోది... మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాల కోసం 20 వేల ఇళ్లు కూడా కట్టించాల్సి ఉంది. 

మూడోది... పద్మశాలీలు చాలా చోట్ల చేనేతలుగా ఉంటారు... మంగళగిరి నియోజకవర్గంలో వారు స్వర్ణకారులుగా ఉన్నారు. పద్మశాలీ సోదరులను ఆదుకునేందుకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. మంగళగిరిలో చేనేత కార్మికుల కోసం తీసుకువచ్చిన పైలెట్ ప్రాజెక్టును రాష్ట్రస్థాయికి తీసుకెళ్లాలని కూడా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 

నాలుగోది... అమరావతి మాస్టర్ ప్లాన్ సందర్భంగా కొందరు రైతుల భూములను యూ1 జోన్ లో పెట్టడం జరిగింది. అందువల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది కూడా రద్దు చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ అన్నకు మాటిస్తున్నా... ఏ బాధ్యతతో అయితే నాకు మంగళగిరి సీటు ఇచ్చారో... అక్కడ గతంలో ఎంత తేడాతో ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి 53 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గి ఈ స్థానాన్ని మీకు అప్పగిస్తాను" అంటూ ప్రకటన చేశారు.

More Telugu News