KCR: రేపు మాయావతితో మాట్లాడుతాను... ప్రవీణ్ కుమార్ వరంగల్ నుంచి కూడా పోటీ చేయచ్చు: కేసీఆర్

  • పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి
  • సీట్ల పంపకాలపై త్వరలో వివరాలు వెల్లడిస్తామన్న కేసీఆర్
  • నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారా? అని ప్రశ్నించిన మీడియా
  • పెద్దపల్లి నుంచి పోటీ చేయవద్దా? అని అడిగిన కేసీఆర్
  • తెలంగాణను కాపాడేందుకే కలిసినట్లు చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
KCR will call mayawati tomorrow

పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి సాగుతామని, రేపు ఈ విషయమై మాయావతితో మాట్లాడుతానని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే మాయావతితో మాట్లాడారని, తాను రేపు మాట్లాడుతానన్నారు. సీట్ల పంపకాలపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. సీట్ల స‌ర్దుబాటు, పొత్తు విధివిధానాలతో పాటు మిగ‌తా విష‌యాల‌న్ని రేపు, ఎల్లుండి ప్రకటిస్తామన్నారు. కొన్ని సీట్ల‌లో వారు, కొన్ని సీట్ల‌లో మేం పోటీ చేస్తామన్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీపై....

నాగ‌ర్‌క‌ర్నూల్ నుంచి ప్ర‌వీణ్ కుమార్ పోటీ చేస్తారా..? అని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించ‌గా.. పెద్దప‌ల్లి నుంచి పోటీ చేయొద్దా..? అంటూ కేసీఆర్ సరదాగా ఎదురు ప్రశ్న వేశారు. రాష్ట్ర అధ్య‌క్షుడు క‌దా... వ‌రంగ‌ల్ నుంచి కూడా పోటీ చేయవచ్చునని వ్యాఖ్యానించారు. ఆయన జ‌న‌ర‌ల్ సీట్ల‌లో కూడా పోటీ చేయవచ్చునని తెలిపారు.

కేసీఆర్‌ను కలవడం ఆనందంగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దేశంలో లౌకికత్వం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తును ఆశీర్వదిస్తారన్నారు. లౌకిక‌త్వాన్ని నిరంత‌రం కాపాడిన కేసీఆర్‌తో క‌లిసి.. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు. మాయావ‌తి ఆశీస్సుల‌తో ముందుకు వెళతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల‌ ముప్పు నుంచి తెలంగాణ‌ను కాపాడేందుకు బీఆర్ఎస్‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణయించినట్లు చెప్పారు.

సీట్ల స‌ర్దుబాటు చేసుకున్న తర్వాత కార్యాచ‌ర‌ణను ప్రకటిస్తామన్నారు. మాయావ‌తితో కూడా కేసీఆర్ మాట్లాడుతారని తెలిపారు. తమ స్నేహం తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల‌ను మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బ‌హుజ‌న వ‌ర్గాల జీవితాలు త‌ప్ప‌కుండా బాగుప‌డుతాయన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి నాలుగు నెల‌లు అవుతోందని... కానీ ఈ ప్ర‌భుత్వం ప‌ట్ల నిరుద్యోగులు సంతోషంగా లేరని విమర్శించారు. నిరుద్యోగులు రోడ్ల‌ మీద‌కు వ‌చ్చే ప‌రిస్థితి ఉందన్నారు. తాము ఐక‌మ‌త్యంగా ముందుకు సాగుతామన్నారు.

More Telugu News