Perni Nani: అందుకే జగన్ అభ్యర్థులను మార్చుతున్నారు: పేర్ని నాని

  • వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదిలీలు
  • కార్యకర్తలు వద్దన్న ఎవరికైనా బదిలీ తప్పదన్న పేర్ని నాని
  • ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోలేని ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నట్టు వివరణ
Perni Nani told why Jagan changes candidates

దేశంలోకెల్లా కార్యకర్తలకు అత్యంత విలువనిచ్చే వ్యక్తి ఒక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాజమండ్రిలో జరిగిన వైసీపీ సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. జగన్ నమ్మేది ముగ్గురినే అని, ఒకటి ఆ దేవుడు, రెండు ప్రజలు, మూడు పార్టీ జెండా మోసే కార్యకర్తలు అని వివరించారు. 

వైసీపీ అభ్యర్థులను మార్చుతుండడం పట్ల చంద్రబాబు, లోకేశ్ మాట్లాడుతున్నారని... కానీ, ఫలానా అభ్యర్థి మా నియోజకవర్గానికి వద్దు అని కార్యకర్తలు చెబితే, జగన్ వెంటనే ఆ అభ్యర్థిని మార్చుతున్నారని పేర్ని నాని వెల్లడించారు. అదీ... జగన్ కార్యకర్తల మాటకు ఇచ్చే విలువ అని స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల గుండెల్లో స్థానం సంపాదించుకోలేని ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని వివరించారు. 

అటు... చంద్రబాబు, ఆయన కొడుకు డబ్బు ఉంటేనే టికెట్లు ఇస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండా మోస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారు... కానీ నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని చూస్తున్నారు... జెండా మోస్తున్నావా అనేది లెక్క కాదు అని విమర్శించారు. డబ్బున్న వారికి మాత్రమే చంద్రబాబు దగ్గర విలువ దొరుకుతుందని అన్నారు.

More Telugu News