Balakrishna: జగన్ నువ్వు దేనికి సిద్ధం?... నిన్ను పాతాళానికి తొక్కడానికి మేం సిద్ధం: బాలకృష్ణ

  • పెనుకొండలో రా కదలిరా సభ
  • టీడీపీకి కార్యకర్తలే బలం అన్న బాలకృష్ణ
  • రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని వెల్లడి
Balakrishna take a dig at CM Jagan

ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ రా కదలిరా సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని స్పష్టం చేశారు. తెలుగువారి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్ అని అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్ఫూర్తిని చంద్రబాబు మరింత ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పరిపాలన నడుస్తోందని విమర్శించారు. ఐదేళ్లు పూర్తవుతున్నా పోలవరం ప్రాజక్టు పూర్తి చేయలేదని వ్యాఖ్యానించారు. అప్పులు చేయకుండా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. వైసీపీ పాలనలో భూకబ్జాలు, ఇసుక మాఫియా పేట్రేగిపోతోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయారని అన్నారు. 

సిద్ధం అన్నాడు జగన్... దేనికి సిద్ధం... బాబాయ్ ని చంపినవాళ్లను కాపాడుతూ చెల్లికి అన్యాయం చేశాడు.. దీనికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? నిరుద్యోగులకు, అమరావతి రైతులకు, దళితులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? దేనికి సిద్ధం నువ్వు? అని ప్రశ్నించారు. 

మాయలు, మోసాలకు మళ్లీ సిద్ధమా? అని ఎత్తిపొడిచారు. సిద్ధం అంటున్నావు... ధర్మయుద్ధానికి మేం సిద్ధం అంటూ సమరశంఖం పూరించారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేసేందుకు టీడీపీ-జనసేన కూటమి సిద్ధం అని ప్రకటించారు. నిన్నూ, నీ పార్టీని పాతాళానికి తొక్కేయడానికి టీడీపీ, జనసేన శక్తులు ఒక్కటయ్యాయి అని వివరించారు. పవన్ కల్యాణ్ మనతో కలిశాడు... మాట కలిసింది, మనసు కలిసింది, ఇక మనల్ని అడ్డుకునే వారెవరూ లేరు అని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News