Chandrababu: రాష్ట్ర సచివాలయాన్నీ తాకట్టు పెట్టేశారు.. జగన్ పై చంద్రబాబు ఫైర్

  • తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్న మాజీ సీఎం
  • ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను నాశనం చేశారని విమర్శ
  • ఏపీని మరో శ్రీలంకలా మార్చేస్తున్నాడు..: లోకేశ్ ట్వీట్
TDP Chief Chandrababu And Lokesh Tweet

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం జగన్ తాకట్టు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టు పెట్టడమేంటని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది భవనాలను కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్నని తీవ్రంగా విమర్శించారు. సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను జగన్ నాశనం చేశారని ఆరోపించారు. ఈ అసమర్థ, అహంకార పాలనలో కోల్పోతున్న వాటిపై ఆంధ్రులు ఆలోచన చేయాలని చంద్రబాబు కోరారు. కాగా, లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు బాలయోగి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి లోక్ సభ స్పీకర్ దాకా ఎదిగిన బాలయోగి ఆదర్శనీయుడని కొనియాడారు.

జగన్ చేస్తున్న అప్పులతో ఆర్థికవేత్తలు కూడా షాక్: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ను మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. జగన్ చేస్తున్న అప్పులు చూసి ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని రూ.12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్.. చివరకు సెక్రటేరియట్ ను కూడా వదలలేదని మండిపడ్డారు. పీకలలోతు అప్పుల్లో మునిగిపోయిన శ్రీలంక కూడా తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదని లోకేశ్ చెప్పారు. జగన్ పనితనాన్ని చూశాక రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చడం కూడా సరికాదని అనిపిస్తోందన్నారు. ఇంతకంటే దిగజారలేరని అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ జగన్ ఏపీ పరువును మంటగలుపుతున్నారని లోకేశ్ విమర్శించారు.

More Telugu News