paidi rakesh reddy: ఉచిత పథకాల పేరుతో రేవంత్ రెడ్డి బిచ్చగాళ్లను చేస్తున్నాడు: బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి

  • కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తే దేశం మళ్లీ ముక్కలవుతుందని వ్యాఖ్యలు
  • కేటీఆర్, రేవంత్ రెడ్డి మేనేజ్‌మెంట్, పేమెంట్ కోటా రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా
  • అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్ అయితే, అభివృద్ధికి కేరాఫ్ బీజేపీ అని వ్యాఖ్య
Paidi Rakesh Reddy lashes out at CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత పథకాల పేరుతో తెలంగాణ ప్రజలను బిచ్చగాళ్లను చేస్తున్నారని బీజేపీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తే దేశం మళ్లీ ముక్కలవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనేజ్‌మెంట్, పేమెంట్ కోటా రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్ అయితే, అభివృద్ధికి కేరాఫ్ బీజేపీ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన అందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తన స్థాయికి తగినట్లు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. రేవంత్ రెడ్డి కేరళలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలా యుద్ధం చేస్తామన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News