Roja: బండ్ల గణేశ్ వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా

  • బండ్ల గణేశ్ ఎవరు? అని మీడియాను ప్రశ్నించిన రోజా
  • సెవన్ ఓ క్లాక్ బ్లేడ్‌తో గొంతు కోసుకొని చచ్చిపోతానన్నాడు... ఆయనేనా? అని ఎద్దేవా
  • అలాంటి వాళ్ల గురించి ఏం చెబుతామని వ్యాఖ్య
Roja counter to Bandla Ganesh comments

అసలు బండ్ల గణేశ్ ఎవరు? సెవన్ ఓ క్లాక్ బ్లేడ్‌తో గొంతు కోసుకొని చచ్చిపోతానన్నాడు... ఆయనేనా? అని ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చురక అంటించారు. ఇటీవల రోజా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని యాక్సిడెంటల్ సీఎం అన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఏపీ మంత్రిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదని, ఆమె డైమండ్ రాణీ... ఆమె గురించి ఏం మాట్లాడుతాం? ఆమెకు సీటు వస్తుందో రాదో అనుమానంగా ఉందని బండ్ల గణేశ్ మండిపడ్డారు.

ఈ క్రమంలో రోజాను గురువారం మీడియా ప్రతినిధులు బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై స్పందన అడిగారు. దీంతో రోజా పైవిధంగా స్పందించారు. 'ఎవరతను.. ఎవరో సెవన్ ఓ క్లాక్ బ్లేడ్‌తో కోసుకొని చచ్చిపోతానన్నాడు ఆయనేనా... ఏం చెబుతాం వాళ్ల గురించి..' అని నవ్వుతూ సమాధానం చెప్పారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ... ఈ రోజుల్లో ఓ మహిళ సక్సెస్‌ఫుల్ స్థానంలో ఉంటే, కష్టపడి పైకి వస్తే, తప్పులను ఎత్తి చూపితే నీచంగా మాట్లాడటం... వల్గర్‌గా మాట్లాడటం టీడీపీకి, జనసేనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అందుకే మహిళలు వారిని అసహ్యించుకున్నారని గుర్తించాలన్నారు.
 

More Telugu News