Mukesh Ambani: గ్రామస్థుడు తీసుకొచ్చిన ఆహారాన్ని ఆరగించిన అపరకుబేరుడు ముకేశ్ అంబానీ.. వీడియో ఇదిగో

  • అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు ముందు ‘అన్న సేవ’లో ఆసక్తికర ఘటన
  • గ్రామస్థుడు తీసుకొచ్చిన ఆహారాన్ని తిని అభినందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Richest man in India Mukesh Ambani ate the food brought by the villagers

భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహానికి సంబంధించిన సన్నాహాలు నెలక్రితమే మొదలయ్యాయి. ఇటీవలే తొలి పెళ్లి పత్రికను సిద్ధం చేసిన అంబానీ కుటుంబం మార్చి 1 నుంచి 3 వరకు ప్రీ-వెడ్డింగ్ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు ముందు బుధవారం రాత్రి ‘అన్న సేవ’ కార్యక్రమాన్ని చేపట్టారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. దాదాపు 51 వేల మందికి రుచికరమైన ఆహారాన్ని వడ్డించారు. కాబోయే వధూవరులు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌తో ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు.


గ్రామస్థుడి భోజనం తిన్న అంబానీ
అంబానీ ఇంట జరిగిన ‘అన్న సేవ’లో చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో కొంతమంది కాబోయే దంపతులు అనంత్-రాధిక చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. కొందరైతే బహుమతులు కూడా అందించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ గ్రామస్థుడు ముఖేష్ అంబానీ కోసం తన ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని ముకేశ్ అంబానీకి తెలియజేయగా ఆయన స్వీకరించారు. ఆహార పాత్రను తన చేతుల్లోకి తీసుకొని సంతోషంగా తింటూ కనిపించారు. ఆహారాన్ని సిద్ధం చేసి తీసుకొచ్చిన వ్యక్తికి అభినందనలు తెలియజేశారు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా చిన్ననాటి స్నేహితులైన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల నిశ్చితార్థం గతేడాది జనవరి 19న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

More Telugu News