VV Lakshminarayana: ప్రత్యేక హోదాపై తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు, పవన్ ప్రకటన చేయాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • శ్రీకాకుళంలో తమ మేనిఫెస్టోను విడుదల చేసిన వీవీ లక్ష్మీనారాయణ
  • ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని పునరుద్ఘాటన
  • ప్రత్యేక హోదా సాధనే తమ అజెండా అని వెల్లడి
Lakshminarayana demands Chandrababu and Pawan should make a statement on special status

జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ నేడు శ్రీకాకుళంలో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని ఉద్ఘాటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే తమ పార్టీ అజెండా అని స్పష్టం చేశారు. 

నేడు తాడేపల్లిగూడెం సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. హోదా నిషిద్ధ అంశమేమీ కాదని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కె సింగ్ కూడా చెప్పారని వివరించారు. 

గతంలో సీఏఏ బిల్లు, రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఢిల్లీ డిక్లరేషన్ సమయాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచే అవకాశం వచ్చినా ఏపీ పార్టీలు సద్వినియోగం చేసుకోలేకపోయాయని లక్ష్మీనారాయణ అన్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 

లక్ష్మీనారాయణ తాను ఎన్నికల్లో పోటీ చేయడంపై మరోసారి స్పష్టతనిచ్చారు. తాను విశాఖ నుంచే పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. 

రాబోయే ఎన్నికల్లో తాము చిన్న చిన్న పార్టీలతో పొత్తు  పెట్టుకుని ఓ ఫ్రంట్ గా ఏర్పడతామని, రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ ఫ్రంట్ పోటీ చేస్తుందని వెల్లడించారు. అవినీతి, రౌడీయిజం, డ్రగ్స్, విధ్వంసం... ఇవేవీ లేని ఆంధ్రప్రదేశ్ సాధనే తమ ధ్యేయమని లక్ష్మీనారాయణ స్పందించారు.

టీడీపీ ఎంపీకి మేనిఫెస్టో అందించిన లక్ష్మీనారాయణ  

వీవీ లక్ష్మీనారాయణ ఇవాళ నరసన్నపేటలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్ మోహన్ నాయుడ్ని కలిశారు. ఆయనకు తమ పార్టీ మేనిఫెస్టో అందించారు. మీరు, మీ పార్టీ యువతరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తున్నాను అంటూ లక్ష్మీనారాయణకు రామ్ మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.

More Telugu News