Ramana Deekshitulu: రమణ దీక్షితులుపై వేటు.. టీటీడీ నుంచి తొలగించిన పాలకమండలి

  • టీటీడీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న చైర్మన్ కరుణాకర్ రెడ్డి
  • ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రమణ దీక్షితులు వీడియో
  • తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అందులో ఆరోపణ
Ramana Deekshitulu Sacked From TTD for controversial remarks

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై పాలకమండలి వేటువేసింది. టీటీడీ నుంచి ఆయనను తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు సోమవారం టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణ దీక్షితులు తీవ్ర వ్యాఖ్యలు చేశారని చైర్మన్ చెప్పారు. రమణ దీక్షితులు వ్యాఖ్యలపై సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చ జరిగిందని తెలిపారు. టీటీడీపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యల తీవ్రతపై చర్చించిన సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వివరించారు. పాలకమండలి నిర్ణయం మేరకు దీక్షితులను టీటీడీ నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. 

తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిరుమలలో క్రిస్టియానిటీ వేగంగా వ్యాప్తి చెందిందని, సీఎం జగన్ క్రిస్టియన్ కావడంతో ఆలయంలోనూ ఆ మతం వ్యాపిస్తోందని రమణ దీక్షితులు ఆరోపించారు. ఈవో ధర్మారెడ్డి సహా ఆలయ సిబ్బందిలో చాలామంది క్రిస్టియన్లు ఉన్నారని విమర్శించారు. ఈవో కుమారుడు చనిపోతే దహనం చేయకుండా ఖననం చేశారని విమర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ క్రమంలోనే రమణ దీక్షితులుపై తిరుమల పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.

More Telugu News