Chandrababu: చంద్రబాబు ఇంటివద్ద టీడీపీ కార్యకర్తల నిరసన

  • తంబళ్లపల్లి టికెట్ కేటాయింపుపై విమర్శలు
  • శంకర్ యాదవ్ కే టికెట్ ఇవ్వాలని డిమాండ్
  • పెట్రోల్ డబ్బాలతో వచ్చిన శంకర్ యాదవ్ అనుచరులు
TDP Workers Protest At Chandrababu Home

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాపై పలువురు నేతలు ఆందోళన చేస్తున్నారు. తొలి జాబితాలో టికెట్ దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్న తమకు కాకుండా బయటివారికి టికెట్ ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. తాజాగా తంబళ్లపల్లె నియోజకవర్గం టికెట్ ఆశించిన గొల్ల శంకర్ యాదవ్ అనుచరులు సోమవారం చంద్రబాబు ఇంటివద్ద ఆందోళన చేపట్టారు. పెట్రోల్ క్యాన్ లతో వచ్చి తంబళ్లపల్లె టికెట్ తమ నాయకుడికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

చంద్రబాబు నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని, పెట్రోల్ క్యాన్ లను తీసేసుకున్నారు. దీంతో శంకర్ యాదవ్ అనుచరులు నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాగా, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా దాసరి పల్లె జయచంద్రారెడ్డిని చంద్రబాబు ఎంపిక చేశారు. దీనిపైనా శంకర్ యాదవ్ అనుచరులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. జయచంద్రారెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన పెద్దారెడ్డి అనుచరుడని ఆరోపిస్తూ.. పార్టీకి కోవర్టుల అవసరంలేదని, అలాంటి వారిని ప్రోత్సహిస్తూ పార్టీ కోసం నిజాయతీగా కష్టపడ్డ వారికి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

More Telugu News