బ్రేకులు వేయడం మరచిన డ్రైవర్.. 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు.. వీడియో ఇదిగో!

  • జమ్మూకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో ఆదివారం ఘటన
  • రైలు దిగుతూ హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయిన లోకోపైలట్
  • బ్రేకుల్లేని కారణంగా పల్లంగా ఉన్న వైపు బయలుదేరిన రైలు
  • 100 కిలోమీటర్ల వేగంతో 84 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన వైనం
  • పలు ప్రయత్నాల తర్వాత రైలును పంజాబ్‌లోని ఉంచీబుస్సీ స్టేషన్ సమీపంలో ఆపిన అధికారులు
జమ్మూకశ్మీర్‌లో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. లోకోపైలట్ (రైలు డ్రైవర్) లేకుండా 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన గూడ్స్ రైలును అధికారులు పలుప్రయత్నాల అనంతరం నిలువరించగలిగారు. రైలును పంజాబ్‌లోని మకేరియన్ జిల్లాలో ఆపారు. 

అధికారుల కథనం ప్రకారం, ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో లోకోపైలట్ రైలును కథువా స్టేషన్‌లో ఆపారు. సిబ్బంది మార్పిడి కోసం రైలు స్టేషన్‌లో ఆపారు. అయితే, రైలు దిగే క్రమంలో హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచారు. 

ఇక రైలు ఆగిన చోట పఠాన్‌కోట్ వైపు పట్టాలు ఏటవాలుగా ఉండటంతో ముందుకు కదిలిన రైలు చూస్తుండగానే వేగం పుంజుకుంది. ఒకానొక దశలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. ఇతర ప్యాసింజర్ రైళ్ల సిబ్బంది లోకోపైలట్‌ల సాయంతో పలు ప్రయత్నాలు చేసి రైలును ఉంచీ బస్సీ స్టేషన్ వద్ద ఆపగలిగారు. దీంతో, పెను ప్రమాదం త్రుటిలో తప్పినట్టయింది. ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. రైల్వే నిర్మాణాల కోసం ఈ గూడ్స్ రైల్లో కాంక్రీట్, ఇతర నిర్మాణ సామగ్రిని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. 


Driverless Goods Train
Jammu And Kashmir
Punjab
Indian Railways
Viral Videos

More Telugu News