Dhruv Jurel: సెంచరీ చేజార్చుకున్న టీమిండియా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్... ఆసక్తికరంగా రాంచీ టెస్టు

  • టీమిండియా-ఇంగ్లండ్ నాలుగో టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులకు టీమిండియా ఆలౌట్
  • ఇంగ్లండ్ కు 46 పరుగుల ఆధిక్యం
  • రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను దెబ్బతీసిన అశ్విన్
Team India new wicket keeper batsman Dhruv Jurel missed maiden test century

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 219/7 తో మూడో రోజు ఆట కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులకు ఆలౌట్ అయింది. 

కెరీర్ లో రెండో టెస్టు ఆడుతున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధ్రువ్ జురెల్ సెంచరీ చేజార్చుకున్నాడు. 149 బంతులు ఎదుర్కొన్న జురెల్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్ లే బౌలింగ్ లో బంతి గమనాన్ని అంచనా వేయడంలో పొరబడి బౌల్డ్ అయ్యాడు. 

టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 73, కెప్టెన్ రోహిత్ శర్మ 2, గిల్ 38, రజత్ పాటిదార్ 17, జడేజా 12, సర్ఫరాజ్ ఖాన్ 14, కుల్దీప్ యాదవ్ 28 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ షోయబ్ బషీర్ 5 వికెట్లు తీయడం విశేషం. మరో స్పిన్నర్ టామ్ హార్ట్ లే 3, సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం, కీలకమైన 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధాటికి ఇంగ్లండ్ 65 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. అయితే ఓపెనర్ జాక్ క్రాలే, జానీ బెయిర్ స్టో జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. 

ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీయడంతో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన క్రాలేని కుల్దీప్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 32 ఓవర్లలో 4 వికెట్లకు 120 పరుగులు. ఇంగ్లండ్ ఓవరాల్ ఆధిక్యం 166 పరుగులకు పెరిగింది.

More Telugu News