Work from Home: వర్క్ ఫ్రం హోం శకం ముగిసినట్టేనా? కంపెనీలు, ఉద్యోగుల్లోనూ మార్పులు!

  • ఉద్యోగులను నయానోభయానో ఆఫీసులకు రప్పిస్తున్న కంపెనీలు
  • చిన్న కంపెనీల్లో ఇప్పటికే వర్క్ ఫ్రం హోంకు స్వస్తి   
  • అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్థిక మందగమనం
  • లేఆఫ్స్ భయాలు, కొత్తనియామకాలు నెమ్మదించడంతో కంపెనీలకు తలొగ్గుతున్న ఉద్యోగులు
Work from home era nearing its end in It sector

ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోం శకం ముగిసినట్టేనని పరిశీలకులు అంటున్నారు. కంపెనీలు, ఉద్యోగుల్లో వస్తున్న మార్పులే ఇందుకు నిదర్శనంగా చూపెడుతున్నారు. దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు అనేకం తమ ఉద్యోగులకు ఆఫీసుకు రావాలంటూ అల్టిమేటంలు జారీ చేశాయి. ఈ ఆదేశాలపై ఉద్యోగుల్లో విముఖత వ్యక్తం అవుతున్నా లేఆఫ్ భయాలు వెంటాడుతుండటంతో కంపెనీ ఆదేశాలు పాటించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఉత్పాదక, సృజనాత్మకత పెంచేందుకు ఆఫీసుల్లోంచే పనిచేయాలని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, సొంతూళ్లకు వెళ్లిపోయిన ఐటీ ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా నగరాల బాట పడుతున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. 

ఇప్పటికే పలు చిన్న కంపెనీలు తమ ఉద్యోగులను పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. పెద్ద కంపెనీల్లోనే హైబ్రీడ్ మోడల్ కొనసాగుతోంది. అయితే, ఆఫీసులకు వచ్చేందుకు ఉద్యోగులు ఇంకా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోంచి పనిచేసినా ఉత్పాదకత తగ్గని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నగరాల్లో కార్యాలయాలకు రాకపోకలు సాగించేందుకు సగటున 2 నుంచి 3 గంటల సమయం పడుతుండటం అనేక మందిని కలవరానికి గురి చేస్తోంది. 

వర్క్ ఫ్రం హోం మొదలైందిలా.. 
కరోనా కాలంలో పనికి ఆటంకాలు ఎదురు కాకుండా అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఫలితంగా నిర్వహణ వ్యయాలు తగ్గడంతో అనేక కంపెనీలు తమ కార్యాలయాలను సైతం ఖాళీ చేశాయి. వర్క్ ఫ్రం హోం తొలినాళల్లో కొందరు ఐటీ ఉద్యోగులు మూన్‌లైటింగ్ చేసి దండిగా డబ్బులు సంపాదించుకున్నారు. ఇక కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో కొన్ని సంస్థలు హైబ్రీడ్ మోడల్‌కు తెరలేపాయి. వారానికి  కనీసం మూడు రోజులన్నా ఆఫీసులకు రావాలని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, అమెరికా, ఐరోపా వ్యవస్థలు మందగమనంలో ఉన్న నేపథ్యంలో దేశీ సంస్థలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులందరినీ ఆఫీసులకు రప్పించేందుకు మొగ్గు చూపుతున్నాయి.

More Telugu News