Perni Nani: ఇక్కడ నీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లు లేరు: కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్

  • సీఎం జగన్ ఒంగోలు సభకు వైసీపీ నేతలు ముఖం చాటేశారన్న కొల్లు రవీంద్ర
  • ఒంగోలులో ఇళ్ల పట్టాల డ్రామా ఆడాడని వ్యాఖ్యలు
  • నీ భాగోతం ప్రజలు చూస్తున్నారంటూ పేర్ని నాని కౌంటర్
  • సొంత వర్గాన్ని కూడా దగా చేసిన వ్యక్తి కొల్లు రవీంద్ర అంటూ విమర్శలు 
Perni Nani slams Kollu Ravindra

ఒంగోలులో ముఖ్యమంత్రి సభ పెడితే సగం మంది వైసీపీ నేతలు ముఖం చాటేశారని, జగన్ పై ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలే నమ్మకం కోల్పోయారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడానికే ఇవాళ ఒంగోలులో ఇళ్ల పట్టాల డ్రామా ఆడాడని విమర్శించారు. జగన్ చెప్పినట్టు ఆడితే అధికారులే బలైపోతారని హెచ్చరించారు. 

ఈ నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. కొల్లు రవీంద్రపై నిప్పులు చెరిగారు. 

"నీ తాటాకు చప్పుళ్లకు, నీ ఉడుత ఊపులకు ఇక్కడెవరూ బెదిరిపోరు... ఇక్కడుంది కుందేళ్లు కాదు. ఇవాళ నీ భాగోతం ప్రజలు చూస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు, రైతాంగానికి, పేదలకు పనులు జరగకుండా నువ్వు ఏ విధంగా ప్రయత్నిస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారు. నీ సిగ్గులేనితనాన్ని చూసి జాలిపడుతున్నా. నీ బెదిరింపులకు అధికారులు ఎవరూ భయపడరు. 

అర్హత కలిగిన ప్రతి పేదవాడికి న్యాయం జరిగే వరకు చివరి క్షణం వరకు పనిచేస్తూనే ఉంటాం. నువ్వు, నీ తాబేదార్లు కలిసి అమ్ముకోవడం తప్పితే, పెదపట్నం వాళ్లకు ఎప్పుడైనా పట్టాలు ఇచ్చావా? నీ సొంత వర్గం మత్స్యకారులను కూడా దగా చేశావు. 2014 నుంచి 2019 వరకు ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చావో చెప్పగలవా?" అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.

More Telugu News