Roja: షర్మిలకు జగన్ సమానంగా ఆస్తులు పంచారు.. ఆమె ఏంటో నిన్న అర్థమైంది: రోజా

  • 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను కూడా జగన్ ఇచ్చారన్న రోజా
  • జగన్ పై షర్మిల విషం చిమ్ముతున్నారని మండిపాటు
  • చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిల ఒక పావు అని ఎద్దేవా
Jagan distributed assets equally to Sharmila Roja

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. డీఎస్సీ విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు మానుకోవాలని ఆమె అన్నారు. 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను జగన్ ఇచ్చి... 17 వేల పోస్టులను భర్తీ చేశారని కొనియాడారు. తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. ఈరోజు తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ బిడ్డనని నాలుగున్నరేళ్లు చెప్పుకున్న షర్మిల ఇప్పుడు ఏపీకి వచ్చి హడావుడి చేస్తున్నారని రోజా మండిపడ్డారు. నిన్న ఆమె చేసిన హడావుడి చూస్తే... ఆమెకు రాజకీయ అవగాహన లేదనే విషయం అర్థమయిందని చెప్పారు. ఆమె పోరాటాలు, ఆరాటాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పై విషం చిమ్ముతున్నారని అన్నారు. షర్మిలకు జగన్ సమానంగా ఆస్తులు పంచి పెట్టారని తెలిపారు. చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ కూడా పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకోవాలని... ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

More Telugu News