Team Australia: చివరి బంతికి ఫోర్ కొట్టి ఆసీస్‌ను గెలిపించిన టిమ్ డేవిడ్

  • మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా
  • చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్
  • 216 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించిన ఆసీస్
  • 44 బంతుల్లో 7 సిక్సర్లతో 72 పరుగులతో మిచెల్ మార్ష్ కెప్టెన్ ఇన్నింగ్స్
Australia last ball win against New Zealand in first t20

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో గత రాత్రి వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టీ 20లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. చివరి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. ఆసీస్ విజయానికి చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగా క్రీజులో ఉన్న డేవిడ్ బంతిని బౌండరీ పంపి జట్టుకు విజయాన్ని అందించిపెట్టాడు.

వికెట్ కీపర్ కాన్వే (63), రచిన్ రవీంద్ర (68) అర్ధ సెంచరీలతో విరుచుకుపడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ 32, గ్లెన్ ఫిలిప్స్ 19(నాటౌట్), చాప్‌మన్ 18 (నాటౌట్)  పరుగులు చేశారు.

అనంతరం 216 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కంగారూ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ మిచెల్ మార్ష్ 44 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడి 72 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెచ్ 24, డేవిడ్ వార్నర్ 32, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 25, జోష్ ఇంగ్లిష్ 20 పరుగులు చేయగా, చివరి బంతికి విన్నింగ్ ఫోర్ కొట్టిన టిమ్ డేవిడ్ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

More Telugu News