Revanth Reddy: వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ మొదలు: సీఎం రేవంత్ రెడ్డి

  • బుధవారం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఏం రేవంత్ రెడ్డి
  • ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసిందని ఆరోపణ
  • పలు ఎత్తిపోతల ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేశారని మండిపాటు
  • కేసీఆర్ హయాంలో జలదోపిడీ ఎక్కువ జరిగిందని ఆరోపణ
Revanth reddy key comments on subsidized cylinder

సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌ హామీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అందించనున్నట్టు తెలిపారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గీలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ఆరు ఎన్నికల హామీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశామన్నారు. 

ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. భీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్‌బీ, దేవాదుల, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను డబ్బులు దండుకొని అసంపూర్తిగా వదిలేశారన్నారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పేరుతో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ నీరు పారలేదన్నారు. ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రోజుకు 12 టీఎంసీల నీరు తరలించుకుపోతున్నా చూస్తుండిపోయారని దుయ్యబట్టారు. 

కొడంగల్‌కు ఎవరూ ఊహించని విధంగా సుమారు రూ.5 వేల కోట్లు తెచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నిధులతో నారాయణ్‌పేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం, మెడికల్, ఇంజినీరింగ్, ప్రభుత్వ జూనియర్, మహిళా డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాలలకు శిలాఫలకాలు వేశామన్నారు. 2014లోనే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల కోసం 69 జీవో తెచ్చానని గుర్తుచేశారు. 7.10 టీఎంసీలతో లక్ష ఎకరాలకు సాగునీరు అందేలా మంజూరు చేయించినట్టు గుర్తు చేశారు. అప్పటి సీఎం వైఎస్  రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి అడిగి పునాది వేశారన్నారు. కానీ ఈ పథకాన్ని పదేళ్ల పాటు పక్కనపెట్టారు. బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకుని ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ఈ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆబ్కారీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పీకర్ ప్రసాద్‌కుమార్ , మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, పర్నికారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News