Paytm: కోలుకుంటున్న పేటీఎం షేర్లు!

  • వరుస సానుకూల పరిణామాలతో కోలుకుంటున్న పేటీఎం షేర్లు
  • గత నాలుగు రోజుల్లో 21 శాతం మేర పెరిగిన విలువ
  • పలుమార్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకిన వైనం
paytm shares jump 21 percent in the past 4 days

ఆర్బీఐ ఆంక్షల కారణంగా కొన్ని రోజులుగా తిరోగమనంలో ఉన్న 'వన్ 97 కమ్యూనికేషన్' (పేటీఎం) సంస్థ షేర్లు పలు సానుకూల సంకేతాల నడుమ క్రమంగా కోలుకుంటున్నాయి. గత నాలుగు రోజుల్లో షేర్ల విలువ ఏకంగా 21 శాతం పెరిగింది. ఇటీవల పలు ట్రేడింగ్ సెషన్లలో షేర్ల విలువ అప్పర్ సర్క్యూట్‌ను చేరుకుంది.

ఇవాల్టి ట్రేడింగ్ సెషన్‌లో పేటీఎం షేర్లకు సుమారు 5 శాతం లాభపడి రూ. 395 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. మొత్తంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో షేర్ల విలువ సుమారు 21 శాతం మేర పెరిగింది. 

మదుపర్లలో పేటీఎం షేర్లపై ఆసక్తికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో విధించిన తుది గడువును ఆర్బీఐ పొడిగించడం, విదేశీ మారకం నిబంధనలు ఉల్లంఘన జరగలేదంటూ ఈడీ సానుకూల నివేదిక, యాక్సిస్ బ్యాంకుతో వ్యూహాత్మక ఒప్పందానికి తోడు సంస్థ యాజమాన్యం చేస్తున్న పలు నిర్మాణాత్మక వ్యాఖ్యలతో మదుపర్లలో మరోసారి పేటీఎం షేర్లపై ఆసక్తి పెరిగింది. సంస్థ షేర్లకు బెర్న్‌స్టైన్ సంస్థ ఔట్‌పెర్ఫార్మ్ రేటింగ్ ఇవ్వడం కూడా ఇందుకు దోహదపడింది. 

వినియోగదారులు, వ్యాపారుల ప్రయోజనాల దృష్ట్యా ఆర్బీఐ ఫిబ్రవరి 16న పేటీఎంకు విధించిన తుదిగడువును మార్చ్ 15 వరకూ పొడిగించిన విషయం తెలిసిందే.

More Telugu News