Shooting in USA: అమెరికాలో దారుణం.. ఇద్దరు పోలీసులు సహా మరో వ్యక్తి కాల్చివేత

  • ఓ ఇంట్లో పిల్లలు ప్రమాదంలో ఉన్నారని తెలిసి వెళ్లిన పోలీసులపై దుండగుడి కాల్పులు
  • చర్చలు జరుపుతుండగా లోపలి నుంచి ఫైరింగ్
  • సమాచారం ఇచ్చి సాయం చేసిన వ్యక్తి కూడా మృత్యువాత
Two policemen and a man who helped them were shot dead by Shooter

గన్ కల్చర్‌ నిత్యకృత్యంగా మారిపోయిన అమెరికాలో మరో దారుణం జరిగింది. మిన్నెసోటా రాష్ట్రంలో ఇద్దరు పోలీసు అధికారులు, వారికి సాయం చేసిన మరో వ్యక్తిని ఓ దుండగుడు కాల్చిచంపాడు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో చాలామంది పిల్లలు ప్రమాదంలో ఉన్నారని, ఆ నివాసంలో ఆయుధాలు ఉన్నాయంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటి బయట ఉండి చర్చలు జరుపుతుండగానే నిందితుడు లోపలి నుంచి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, వారికి సమాచారం ఇచ్చి సహాయంగా నిలిచిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు తెగబడ్డ దుండగుడు చనిపోయాడని, అతడి వివరాలను ఇంకా గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. ఇంట్లోని ఏడుగురు పిల్లలు సురక్షితంగా ఉన్నారని, వారి వయసు 2 -15 ఏళ్ల మధ్య ఉంటుందని వెల్లడించారు. అయితే  షూటర్ ఎలా చనిపోయాడనే విషయాన్ని వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.

ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ బర్న్స్‌ స్పందించారు. ఇది హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఒక కుటుంబం ప్రమాదంలో ఉందని తెలిసి పోలీసులు స్పందించారని, కాల్పుల్లో ప్రాణత్యాగం చేశారని తెలిపారు. 27 ఏళ్లు, 40 సంవత్సరాల వయస్సున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ కు చెందిన ఇద్దరు పారామెడిక్స్ చనిపోయారని వివరించారు. కాగా దుండగుడి ఇంట్లో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని మిన్నెసోటా బ్యూరో ఆఫ్ క్రిమినల్ అప్రెహెన్షన్ సూపరింటెండెంట్ ఎవాన్స్ వెల్లడించారు. దుండగుడితో చర్చల కారణంగా ప్రతిష్ఠంభన నెలకొందని, ఈలోగా అతడు కాల్పులకు పాల్పడ్డాడని ఎవాన్స్ వివరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని ఎవాన్స్ చెప్పారు.

More Telugu News