Jai shah: దేశవాళీ క్రికెట్ ఆడని ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ సెక్రటరీ జైషా

  • బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు, భారత్-ఏ జట్టు ఆటగాళ్లు సహా అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని హెచ్చరించిన జైషా
  • దేశవాళీ క్రికెట్ ఆడకుంటే తీవ్రమైన చిక్కుల్లో పడతారని వార్నింగ్
  • జాతీయ జట్టులోకి ఎంపికకు దేశవాళీ క్రికెటే ప్రామాణికమని సూచించిన జైషా
BCCI Secretary Jaisha gave a strong warning to players who do not playing domestic cricket

సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు, భారత్-ఏ జట్టు ప్లేయర్లు సహా ఇతర క్రికెటర్లు అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ సెక్రటరీ జైషా పునరుద్ఘాటించారు. దేశీయ క్రికెట్ ఆడని ప్లేయర్లు తీవ్రమైన ఇబ్బందుల్లో పడతారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జాతీయ జట్టులోకి ప్లేయర్ల ఎంపికలో దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శన అత్యంత కీలకమవుతుందని, దేశవాళీ క్రికెట్ ఆడని ఆటగాళ్లు తీవ్రమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ఆటగాళ్లను హెచ్చరించారు. ఈ మేరకు జై షా రాసిన లేఖను జాతీయ మీడియా సంస్థ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించింది. దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇవ్వడంపై జై షా ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘ ఇటీవల మొదలైన కొత్త ట్రెండ్ ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్‌కే అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది అనూహ్యమైన మార్పు. దేశవాళీ క్రికెట్ ఎల్లప్పుడూ భారత క్రికెట్ నిలబెట్టే పునాది లాంటిది. దేశవాళీ క్రికెట్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. భారత క్రికెట్‌పై మా దృక్పథం మొదటి నుంచి సుస్పష్టంగా ఉంది. టీమిండియాకి ఆడాలని ఆకాంక్షించే ప్రతి క్రికెటర్ దేశీయ క్రికెట్‌లో తమని తాము నిరూపించుకోవాలి. దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శన జాతీయ జట్టులోకి ఎంపికకు ముఖ్యమైన ప్రామాణికం. దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనకపోవడం తీవ్రమైన చిక్కులను తెచ్చిపెడుతుంది” అని లేఖలో జైషా పేర్కొన్నారు.

 సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ పర్యటన నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేవారంటూ జైషా ప్రస్తావించారు. దేశీయ క్రికెట్‌ను కేవలం నిబంధనగా భావించకుండా బాధ్యతగా, గర్వంగా భావించాలని జైషా సూచించారు. కాగా ఐపీఎల్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో సన్నద్ధత కోసం ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్ వంటి స్టార్ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌కు గైర్హాజరు అవుతున్నారు. బరోడాలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా శిక్షణ తీసుకుంటున్నారు.

More Telugu News