Chandrababu: చెరుకు తోటలు కాల్చడం తప్ప బాపట్ల ఎంపీకి ఏం తెలుసు?: చంద్రబాబు

  • బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో రా కదలిరా సభ
  • బాపట్ల ఎంపీకి కబ్జాలు, బెదిరింపులే తెలుసంటూ చంద్రబాబు ధ్వజం 
Chandrababu fires on Bapatla MP

పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా పులివెందుల పంచాయితీ చేస్తావా? మీరు చొక్కాలు మడతపెడితే మా వాళ్లు కుర్చీలు మడతపెడతారు అంటూ సీఎం జగన్ ను హెచ్చరించారు. ఆనాడు నేను అనుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయాల ముసుగులో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 

ఇక, ప్రజలకు సేవ చేసే వాలంటీర్లను తాము అభినందిస్తామని, కానీ వైసీపీకి సేవ చేసే వాలంటీర్లపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అన్నారు. టీడీపీ వచ్చాక పేదలను ఆదుకుంటామని, రెండు సెంట్ల స్థలం ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

పర్చూరు రాజకీయాలు రాష్ట్రానికే స్టడీ కేస్ వంటివి!

పర్చూరు రాజకీయాలు రాష్ట్రానికే స్టడీ కేస్ వంటివి. వైసీపీ అధికారంలోకి వచ్చాక పర్చూరులో కబ్జాలు, రౌడీయిజం, దాడులు చేశారు. పర్చూరులో దొంగ ఓట్లు నమోదు చేసి గెలుద్దామని భావించారు. 14 వేల ఫారం-7 దరఖాస్తులు పెట్టారు. కానీ పర్చూరులో మా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హీరోలా పోరాడాడు. ఏలూరి సాంబశివరావు వల్ల ఆమంచి ఇంటికి... కథ కంచికి చేరింది. 

పర్చూరు గ్రానైట్ వ్యాపారులపై కేసులు పెట్టి వేధించారు. అధికారులు వైసీపీ మూకలతో వెళ్లి గ్రానైట్ వ్యాపారులను బెదిరించారు. గొట్టిపాటి రవికుమార్ కు రూ.3 వేల కోట్ల జరిమానా విధించారు. 

ఇక, బాపట్ల ఎంపీ ఉన్నాడు. కబ్జాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు... ఇవే అతడికి తెలిసింది. చెరుకు తోటలు కాల్చడం తప్ప బాపట్ల ఎంపీకి ఏం తెలుసు? అమరావతి రోడ్లపై మట్టిని కూడా దొంగిలించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీకు రియల్ సినిమా చూపిస్తారు. 

జగన్ ఆ బటన్ ఎందుకు నొక్కలేదో!

బటన్లు నొక్కుతున్నానని చెప్పే జగన్ మద్యపాన నిషేధంపై ఎందుకు బటన్ నొక్కలేదు? అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు అన్నారు... మరి ఆ బటన్ ఎందుకు నొక్కలేదు? వైసీపీ పాలనలో ఏటా రూ.30 వేల కోట్ల ఆదాయం తగ్గింది. జగన్ పాలనలో ప్రజల తలసరి ఆదాయం పడిపోయింది. రైతును రాజు చేయడం టీడీపీ-జనసేన ప్రభుత్వానికే సాధ్యం.

More Telugu News