KTR: మోదీ, రేవంత్ రెడ్డిలకు నోటీసుల్లేవు... కానీ కేసీఆర్ గొంతు నొక్కారు: ఈసీపై కేటీఆర్ ఆగ్రహం

  • శ్రీరాముడి ఫొటోతో ప్రచారం చేస్తున్న అరుణ్ గోవిల్‌పై చర్యలు లేవన్న కేటీఆర్
  • మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీ, అమిత్ షాలకు నోటీసులు జారీ చేయడం లేదన్న మాజీ మంత్రి
  • ఈసీ బీజేపీ కనుసన్నుల్లో నడుస్తోందని ఆరోపణ
KTR fires at EC over notices to KCR

బీజేపీ నేతలు ఏం మాట్లాడినా ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం లేదని, కానీ కేసీఆర్ గొంతును మాత్రం నొక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన బీఆర్ఎస్ భవన్‌లో మాట్లాడుతూ... ఎన్నికల సంఘం కూడా బీజేపీ కనుసన్నల్లో పని చేస్తోందని ఆరోపించారు. తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. శ్రీరాముడి ఫొటోతో ప్రచారం చేస్తున్న అరుణ్ గోవిల్‌పై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు.

మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నోటీసులు జారీ చేయడం లేదని ఆరోపించారు. కానీ ఆవేదనతో మాట్లాడిన కేసీఆర్‌పై మాత్రం 48 గంటల పాటు నిషేధం విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, దేశంలోని ప్రస్తుత  ప‌రిస్థితులు చూస్తుంటే కేంద్ర ప్ర‌భుత్వం, వారు తీసుకున్న నిర్ణ‌యాలు దానికి అనుగుణంగా జ‌రిగిన నియామ‌కాలు, స్వ‌యంప్ర‌తిప‌త్తి సంస్థ‌ల్ని త‌మ గుప్పిట్లో పెట్టుకుని ఆటాడిస్తున్న‌ట్లుగా తెలిసిపోతోందన్నారు.

ఈసీ బీజేపీ కనుసన్నుల్లో నడుస్తోందనే విషయంలో తమకు ఎలాంటి రెండో ఆలోచ‌న, అభిప్రాయం లేవన్నారు. దేశంలో బీజేపీ వాళ్లు జాతులు, మ‌తాల ఆధారంగా.. ప్ర‌ధాని, హోంమంత్రి మ‌తవైష‌మ్యాలు రెచ్చ‌గొట్టేలా మాట్లాడినా‌, విద్వేషాన్ని రెచ్చ‌గొట్టేలా దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసినా, ప్ర‌త్య‌ర్థ పార్టీల‌ను బీజేపీ నాయ‌కులు బండ‌బూతులు తిడుతున్నా.. వాళ్ల బీజేపీ4ఇండియా అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ ముస్లింల‌పై విషం చిమ్ముతూ.. ప్ర‌చారం చేస్తున్నా ఎలాంటి చర్యా లేదన్నారు. ముస్లింలే ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ఇటీవల మోదీ వ్యాఖ్యానించారని, ఈ వ్యాఖ్యలపై 25 వేలమంది పౌరులు ఈసీకి ఫిర్యాదు చేస్తే కనీసం మోదీకి నోటీసులివ్వలేదన్నారు. మోదీకి ఎన్నికల సంఘం భయపడిందని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిందని, దీనికి తమ లాయర్లు, నాయకులు స్పందించి లీగల్ సెల్ ద్వారా జవాబు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో ఎండిన పంటలు చూసిన తర్వాత కేసీఆర్ ఆవేదనతో మాట్లాడినట్లు చెప్పారు. ఆవేదనలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసినందుకు... కొంత పరుషంగా మాట్లాడినందుకు 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించారన్నారు.

More Telugu News