Bandi Sanjay: బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

  • ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు టచ్‌లో ఉన్నారన్న బండి సంజయ్
  • ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీయేలో చేర్చుకోలేదన్న బండి సంజయ్
Bandi Sanjay says brs mlas touch with bjp

పలువురు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.

ఆ పార్టీతో తమకు ఎలాంటి పొత్తు లేదని... కానీ కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. అవినీతి పార్టీలతో ప్రధాని మోదీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోరన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీయేలో చేర్చుకోలేదని... ఇక ఇప్పుడు చేర్చుకుంటామా? అని ప్రశ్నించారు. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు పక్కదారులు చూసుకుంటున్నారన్నారు. పొత్తులు అనేది కేవలం కేసీఆర్ సృష్టి అన్నారు.

గొర్రెలు, కాళేశ్వరం అవినీతి గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని... కానీ కేసులు ఎందుకు పెట్టడం లేదో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ముందు బీజేపీ నేతలు వెళ్లి చూశారనీ... సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశామనీ అన్నారు. రిపోర్ట్ కూడా ఇచ్చినట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకూ పనికిరాదని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు.

More Telugu News