Kinjarapu Ram Mohan Naidu: ఏపీలో జరిగిన అవినీతిని శ్వేతపత్రంలో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగించింది: ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • పార్లమెంటులో శ్వేతపత్రం విడుదల చేసిన నిర్మలా సీతారామన్
  • ఏపీలో అత్యధికంగా అవినీతి జరిగిందన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్
  • అవినీతి యువరాజు ఆస్తులు ఏడేళ్లలో పెరిగిపోయాయని వ్యాఖ్యలు
MP Ram Mohan Naidu speech in Lok Sabha

టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్ సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన శ్వేతపత్రంపై మాట్లాడారు. 2014కి ముందు జరిగిన అవినీతి గురించి శ్వేతపత్రం విడుదల చేశారని, కానీ, అత్యధికంగా అవినీతి జరిగిన ఆంధ్రప్రదేశ్ గురించి శ్వేతపత్రంలో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రామ్మోహన్ నాయుడు అన్నారు. 

అవినీతికి రారాజు అనదగ్గ వ్యక్తి 2004 నుంచి 2014 వరకు ఏపీని పాలించారని, ఆ సమయంలోనే అవినీతి యువరాజు రాజకీయాల్లోకి వచ్చారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 2004లో ఆ యువరాజు ఆస్తులు రూ1.70 కోట్లు మాత్రమేనని, కానీ 2004 నుంచి 2011 మధ్యలో ఆయన ఆస్తులు రూ.356 కోట్లకు పెరిగాయని రామ్మోహన్ నాయుడు వివరించారు. 

కేవలం ఏడేళ్లలోనే ఆయన ఆస్తులు అంతగా ఎలా పెరిగాయో తెలుసుకునేందుకు ఈ సభలో అందరూ ఆసక్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈడీ, ఐటీ, సీబీఐ కూడా ఇదెలా జరిగిందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నాయని రామ్మోహన్ నాయుడు వ్యంగ్యం ప్రదర్శించారు. అందుకే ఆయనపై 32 కేసులు నమోదు చేశాయని, రూ.43 వేల కోట్ల మేర అటాచ్ చేశాయని వివరించారు. 

ఏపీ ప్రజలు నాడు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి చంద్రబాబును సీఎంగా ఎన్నుకున్నారని, కేంద్రంలో నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏపీలో ఒక్క అవినీతి కేసు కూడా నమోదు కాలేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. 

కానీ, 2019లో ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అధికారంలోకి వచ్చారని... మాఫియాను లీగలైజ్, సెంట్రలైజ్ చేశారని విమర్శించారు. ఇప్పటిరోజుల్లో ఒక టీ తాగినా గూగుల్ పే ద్వారా చెల్లించవచ్చు... కానీ ఏపీలో మద్యాన్ని యూపీఐ చెల్లింపులతో, కార్డుతో కొనుక్కోలేం... రసీదు కూడా పొందలేం... దీన్నిబట్టి మద్యంలో ఎంత అవినీతి సొమ్మును సృష్టిస్తున్నారో ఆలోచించవచ్చు అని వివరించారు. మొత్తం ఇసుకను ఒక్క కంపెనీకే అప్పగించారని ఆరోపించారు.

More Telugu News