Accidental Firing: ప్రమాదవశాత్తూ పేలిన తుపాకీ.. రైల్వే కానిస్టేబుల్ దుర్మరణం

  • ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఘటన
  • రైల్వే కానిస్టేబుల్ ట్రెయిను దిగుతుండగా ప్రమాదవశాత్తూ పేలిన తుపాకీ
  • కానిస్టేబుల్ ఛాతిలోకి తూటా దూసుకుపోవడంతో మృతి
  • అక్కడే ఉన్న ప్రయాణికుడికీ తూటా గాయం, ఆసుపత్రిలో చికిత్స
RPSF jawan killed passenger injured in accidental firing at Raipur railway station

ప్రమాదవశాత్తూ సర్వీసు తుపాకీ పేలిన ఘటనలో ఓ రైల్వే కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో మరో ప్రయాణికుడు కూడా గాయపడ్డాడు.  దినేశ్ చంద్ర (30) అనే కానిస్టేబుల్ ఎస్-2 కోచ్ నుంచి కిందకు దిగుతుండగా తుపాకీ పేలింది. తూటా నేరుగా అతడి ఛాతిలోకి దూసుకుపోవడంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమీపంలోనే పైబెర్తుపై నిద్రిస్తున్న మహ్మద్ డానిష్ అనే ప్రయాణికుడికి కూడా తూటా తగిలి గాయమైంది. 

బాధితులిద్దరినీ ఆసుపత్రికి తరలించగా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కడుపులో గాయమైన ప్రయాణికుడికి చికిత్స కొనసాగుతోంది. మృతుడిది రాజస్థాన్ అని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

More Telugu News