Medical College: హాస్టల్ లో చేరాల్సిందేనని ఒత్తిడి చేస్తే ఊరుకోం: ఎన్ఎంసీ

  • స్టూడెంట్ల ఫిర్యాదులతో వైద్య కళాశాలలకు మెడికల్ కమిషన్ వార్నింగ్
  • వసతి కల్పించడం మీ బాధ్యత.. చేరాలా వద్దా అనేది విద్యార్థుల ఇష్టమని వెల్లడి
  • విద్యార్థులపై ఒత్తిడి చేస్తే కాలేజీల సీట్లలో కోత పెడతామని హెచ్చరిక
Colleges Can not Force Students To Stay In Hostel Warns Medical Body

పీజీ విద్యార్థులకు తగిన వసతి కల్పించడం మెడికల్ కాలేజీలకు తప్పనిసరి.. అయితే, అందులో చేరాలా వద్దా అనే నిర్ణయం మాత్రం విద్యార్థులదేనని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. హాస్టల్ లో చేరాల్సిందేనని విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని కాలేజీ యాజమాన్యాలను హెచ్చరించింది. పీజీ మెడికల్ విద్యార్థుల ఫిర్యాదుల మేరకు ఎన్ఎంసీ తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థులపై ఒత్తిడి చేసే కాలేజీలకు భారీగా జరిమానా విధించడంతో పాటు సీట్లలో కోత పెట్టడం, అడ్మిషన్స్ చేపట్టకుండా ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మెడికల్ పీజీ కాలేజీలకు అనుబంధంగా హాస్టల్స్ నిర్వహిస్తున్న కాలేజీలు.. వాటిలో తమను చేరాలని ఒత్తిడి చేస్తున్నాయని, భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని పలువురు పీజీ మెడికోలు ఎన్ఎంసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్ఎంసీ స్పందిస్తూ.. నిబంధనల ప్రకారం పీజీ కాలేజీలు తమ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించడం తప్పనిసరి అని పేర్కొంది. అయితే, వాటిలో చేరడం మాత్రం విద్యార్థులకు తప్పనిసరి కాదని తేల్చిచెప్పింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ (పీజీఎంఈఆర్), 2023 నిబంధనలు ఇదే విషయం చెబుతున్నాయని, ఈ రూల్స్ కు అనుగుణంగా కాలేజీలు నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

More Telugu News