Nara Bhuvaneswari: కేవలం డిగ్రీ చదివి గృహిణిగా ఉన్న నాపై చంద్రబాబు అంత నమ్మకం చూపారు: నారా భువనేశ్వరి

  • వెంకటపాలెంలో మహిళా పాడి రైతులతో నారా భువనేశ్వరి సమావేశం
  • మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని వ్యాఖ్యలు
  • హెరిటేజ్ సంస్థను అప్పగించే సమయంలో చంద్రబాబు తనను ప్రోత్సహించారని వెల్లడి
  • మహిళా పాడి రైతుల ప్రశ్నలకు నారా భువనేశ్వరి సమాధానాలు

Nara Bhuvaneswari says Chandrababu encourages her a lot

తుళ్లూరు మండలం వెంకటపాలెంలో మహిళా పాడిరైతులతో నారా భువనేశ్వరి ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. మహిళలు తమ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దని సూచించారు. 

మహిళలను వంటింటి నుండి సమాజంలోకి తీసుకొచ్చి ప్రోత్సహించిన నాయకులు నందమూరి తారకరామారావు అని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ తర్వాత నారా చంద్రబాబునాయుడు కూడా మహిళలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు చేపట్టారని భువనేశ్వరి వివరించారు. 

"ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలను ప్రోత్సహించి ముందుకు నడిపారు. 1994లో హెరిటేజ్ సంస్థ ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను చంద్రబాబు నాకు అప్పగించారు. కంపెనీ నిర్వహణ బాధ్యతలు ఇస్తే నా వల్ల ఏం అవుతుంది? అని నేను అన్నప్పుడు... నువ్వు చేయగలవు, నువ్వు ముందుకు నడిపించగలవు అని ఆనాడు చంద్రబాబు నాతో అన్న మాటలను నేను ఎప్పుడూ మర్చిపోలేను. 

కేవలం డిగ్రీ చదివి గృహిణిగా ఉన్న నాపై చంద్రబాబు అంత నమ్మకం చూపారు. మహిళా శక్తిపై చంద్రబాబుకు అపారమైన నమ్మకం. 1994లో హెరిటేజ్ సంస్థలో కేవలం 400 మంది పాడిరైతులు ఉండేవారు. నేడు 11 రాష్ట్రాల్లో హెరిటేజ్ కంపెనీ ఉంది. 10 చేతులు కలిస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి హెరిటేజ్ కంపెనీ నిదర్శనం. 3 లక్షల మంది రైతులు, సిబ్బంది ఓ టీమ్ గా పనిచేయడం వల్ల కంపెనీ ముందుకు వెళుతోంది. 

పాడిపంటలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళలు పాలు, నెయ్యి అమ్ముకుని కుటుంబాలను నడిపేవారు. నేడు కూడా మహిళలు భర్త సంపాదనపై ఆధారపడకుండా కుటుంబాన్ని పోషిస్తున్నారు. 

మా ఇంట్లో కూడా మేం వ్యాపారం చేస్తూ మగవాళ్లపై ఆధారపడకుండా ఉన్నాం. నేను, నా కోడలు వ్యాపారం చేస్తున్నాం. గతంలో ఆడపిల్లలను చిన్న చూపు చూసి చదువు చెప్పించేవారు కాదు. కేవలం ఇంటి పనులు నేర్పించి వంటింట్లో కూర్చోబెట్టేవారు. నేడు మహిళలు చదువుల్లో ముందు ఉన్నారు. ఆడపిల్లల్ని బాగా చదివించి భవిష్యత్తులో ముందుకు నడిపించాలని అందరినీ కోరుతున్నా. మహిళలు ఏ పనిలో అయినా, ఏ రంగంలో అయినా రాణించగలరు. 

నాన్న ఆశయాల సాధన కోసం స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, వైజాగ్, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు నెలకొల్పాం. ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్ 6 వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్య ను అందిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి బాలికలకు ప్రత్యేకంగా కాలేజీ నడిపిస్తున్నాం. ఏపీలోని చల్లపల్లి గ్రామంలో అనాధ పిల్లలకు ప్రతియేటా 360మంది కి ఉచితంగా విద్యను అందిస్తున్నాం.

మా కుటుంబంపై మీరు చూపించే అభిమానాన్ని మరువలేను

మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు, మహిళలు మాపై చూపించిన అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను. మాకు ధైర్యం చెప్పి, మా వెన్నంటి నిలిచిన టీడీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. 

మహిళా పాడిరైతులు అడిగిన ప్రశ్నలకు నారా భువనేశ్వరి సమాధానాలు

శేషకుమారి, వెంకటపాలెం గ్రామం: నేను గేదెల్ని మేపి పాల వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను. మీరు మాలాంటి వాళ్లను ఎలా ప్రోత్సహిస్తారు?

భువనేశ్వరి: నేను, నా కోడలు ఇద్దరం కలిసి మా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళుతున్నాం. మా కంపెనీల్లో మహిళలకు అవకాశాలు ఇస్తున్నాం. హెరిటేజ్ కంపెనీ నుండి పశువుల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తున్నాం.

మనీషా, వెంకటపాలెం: గతంలో మీరు ఎన్నడూ రాజకీయాల్లోకి, బయటకు రాలేదు..నేడు ఎందుకు వచ్చారు? మీరు ఎలా భావిస్తున్నారు?

భువనేశ్వరి: కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు. కానీ అనివార్య పరిస్థితుల్లో నేను ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఆ సమయంలో చంద్రబాబు నన్ను పిలిచి పార్టీ బిడ్డలు చనిపోయారు... వారి ఇంటికి స్వయంగా వెళ్లి వారిని ఓదార్చి ఆర్థికసాయం చేసి రావాలని ఆదేశించారు. అందుకే నేను నిజం గెలవాలి అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి, కార్యకర్తల మధ్యలోకి వచ్చాను.

శైలజ, వెంకటపాలెం గ్రామం: అమరావతి ఉద్యమానికి మీరు మీ చేతి గాజులను విరాళంగా ఇచ్చారు. మాకు సంఘీభావం తెలిపి, ధైర్యం చెప్పారు. రానున్న కాలంలో అమరావతి రాజధానిగా ఉంటుందా?

భువనేశ్వరి: అమరావతే రాజధానిగా ఉంటుంది... రెండో ఆలోచన అవసరం లేదు. 

టీడీపీ కార్యకర్తల్ని ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలు: తెనాలి శ్రావణ్ కుమార్, తాడికొండ టీడీపీ ఇన్చార్జి

చంద్రబాబునాయుడు గారు అక్రమంగా అరెస్టు కాబడిన సమయంలో మనస్తాపానికి గురై మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాల వద్దకు నేరుగా వచ్చి పరామర్శించి, ఆర్థికసాయం అందిస్తున్న భువనేశ్వరి గారికి తాడికొండ నియోజకవర్గం తరపున, రాష్ట్ర ప్రజల తరపున నా నిండు కృతజ్ఞతలు. బాధితుల అకౌంట్లలోకి ఆర్థికసాయం పంపిచే అవకాశం ఉన్నా... కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ... నేరుగా కార్యకర్తల ఇళ్లకు వచ్చి పరామర్శించడం భువనమ్మలోని గొప్ప మనస్తత్వానికి ధన్యవాదాలు.

More Telugu News