KTR: బీఆర్ఎస్‌కు హైదరాబాద్‌లో భారీ షాక్... కాంగ్రెస్‌లో చేరిన కేటీఆర్ సన్నిహితుడు

  • బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరిన బాబా ఫసియుద్దీన్
  • బీఆర్ఎస్ ఇటీవల అనుసరించిన విధానాలు తనకు నచ్చలేదంటూ కేసీఆర్‌కు రాజీనామా లేఖ
  • రాజకీయంగానే కాకుండా భౌతికంగా లేకుండా చేసే కుట్ర జరుగుతోందని తెలిసి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశానని వెల్లడి
  • కానీ వారిపై చర్యలు తీసుకోలేదంటూ లేఖలో ఆవేదన
KTR Close aid Joins Congress

జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పోరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి... కాంగ్రెస్‌లో చేరారు. ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌తో విభేదాల కారణంగా ఆయన బీఆర్ఎస్‌ను వీడినట్లుగా చెబుతున్నారు. గురువారం సాయంత్రం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు.

కేసీఆర్‌కు రాజీనామా లేఖ

బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ అధినేతకు రాజీనామా లేఖను పంపించారు. పార్టీ కోసం ఇరవై రెండేళ్లుగా సైనికుడిలా పని చేశానని పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు రక్షణ కరవైందని లేఖలో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పార్టీ అనుసరించిన విధానాలు తనకు నచ్చలేదని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేశానని.. అలాంటి తనకు కొంతమంది నాయకులు రాజకీయ భవిష్యత్తు లేకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోలేదని.. పైగా వారికే మద్దతివ్వడం తనను బాధించిందన్నారు.

రాజకీయంగానే కాకుండా భౌతికంగా లేకుండా చేసే కుట్ర కూడా జరుగుతోందని తెలిసిందని... ఈ విషయాన్ని వెంటనే అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదన్నారు. గుండెల నిండా గులాబీ జెండాతో 22 ఏళ్లు సిపాయిలా పని చేసిన తనలాంటి ఉద్యమకారుడికి రక్షణ కరవైందన్నారు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి... మీడియా అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

More Telugu News