Indian American student suicide: యూఎస్‌లో భారత సంతతి విద్యార్థిది ఆత్మహత్యే.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి!

  • ఇండియానాలోని వారెన్ కౌంటీలోని వనంలో సమీర్ కామత్ మృతదేహం లభ్యం
  • అతడిది ఆత్మహత్యగా పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి
  • తనని తానే కాల్చుకున్నట్టు సమీర్ తలపై గాయం
Indian American student Sameer Kamath at Purdue died by suicide autopsy report confirms

అమెరికాలోని పర్‌డ్యూ యూనివర్సిటీ భారత సంతతి విద్యార్థి సమీర్ కామత్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోస్ట్ మార్టం నివేదికలో తాజాగా వెల్లడైంది. తనను తానే కాల్చుకున్నట్టు తలకు గాయమైందని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 5న ఇండియానాలోని క్రోస్ గ్రోవ్ ఉద్యానవనంలో అతడి మృతదేహం లభించింది. ఫిబ్రవరి 6న పోస్ట్ మార్టం జరగ్గా తాజాగా అధికారులు నివేదిక విడుదల చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

పర్‌డ్యూ యూనివర్సిటీ పత్రిక ప్రకారం, అమెరికా పౌరుడైన సమీర్ కామత్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో డాక్టోరల్ విద్యార్థిగా ఉన్నారు. మాసాచుసెట్స్‌కు చెందిన అతడు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్రెస్ట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాడు. 2021లో పర్‌డ్యూ యూనివర్సిటీలో చేరిన అతడు మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు. 2025లో అతడి డాక్టోరల్ చదువు కూడా పూర్తి కావాల్సి ఉంది. 

అమెరికాలో ఇటీవల కాలంలో పలువురు భారతీయ విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి ఒహాయోలోని సిన్సినాటీలో మరణించారు. అతడి మరణానికి కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. అంతకుముందు వారం రోజుల వ్యవధిలోనే వివేక్ సైనీ, నీల్ ఆచార్య అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. జనవరి 30న పర్‌డ్యూ కాంపస్‌లో నీల్ ఆచార్య మృతదేహాన్ని గుర్తించగా, జార్జియాలోని లిథోనియా ప్రాంతంలో వివేక్ సైనీని దారుణంగా చంపేశారు. జనవరి 20న అకుల్ ధవన్ అనే భారతీయ విద్యార్థి మృతదేహాన్ని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయి సమీపంలో గుర్తించారు.

More Telugu News