ఏపీలో అద్భుతం జరగబోతోంది.. కేసీఆరే ఓడిపోయారు.. జగన్ ఎంత?: నాగబాబు

  • జగన్ ఆంధ్ర జాతికే ప్రమాదకరమన్న నాగబాబు
  • కరోనా తర్వాత అంతటి ప్రమాదకర వైరస్ వైసీపీ అని విమర్శ
  • జనసేన, టీడీపీనే ఈ వైరస్ కు విరుగుడు అని వ్యాఖ్య
ఏపీలో రాజకీయాలు రసవత్తర మలుపు తిరగబోతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేనలు పొత్తులో ఉండగా... తాజాగా బీజేపీ ఈ కూటమిలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడం అందరికీ తెలిసిందే. దీంతో, ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదరబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేత కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. 

ఏపీలో అద్భుతం జరగబోతోందని నాగబాబు అన్నారు. అద్భుతం జరుగుతున్న తరుణంలో జనసైనికులందరూ సహకరించాలని ఆయన కోరారు. సీఎం జగన్, వైసీపీలు ఆంధ్ర జాతికే ప్రమాదకరమని అన్నారు. కరోనా తర్వాత అంతటి ప్రమాదకరమైన వైరస్ వైసీపీనే అని చెప్పారు. ఈ వైరస్ కు విరుగుడు జనసేన, టీడీపీలే అని అన్నారు. జరుగుతున్న, జరగబోతున్న పరిణామాలకు అందరూ సహకరించాలని కోరారు.  

ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ నే ఆ రాష్ట్ర ప్రజలు ఓడించి, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని నాగబాబు అన్నారు. అలాంటిది ఏపీలో ఏ అభివృద్ధి చేయకుండా, రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ ను ప్రజలు ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు. వైసీపీని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు.

Nagababu
Janasena
Telugudesam
Jagan
YSRCP
AP Politics

More Telugu News