Indian Student Dead: అమెరికాలో భారత సంతతి విద్యార్థి మృతి!

  • ఇండియానాలోని వారెన్ కౌంటీలోని వనంలో సమీర్ కామత్ మృతదేహం లభ్యం
  • ఘటన వెనుక కారణాలు తెలుసుకునేందుకు పోలీసుల దర్యాప్తు
  • పర్‌డ్యూ యూనివర్సిటీలో డాక్టోరల్ కోర్సు చేస్తున్న సమీర్
  • అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకూ ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతి
Indian student found dead in Indiana fifth incident in US second in the university

అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పర్‌డ్యూ యూనివర్సిటీ విద్యార్థి, భారత సంతతి యువకుడు సమీర్ కామత్ మృతి చెందాడు. సోమవారం ఇండియానా రాష్ట్రంలోని వారెన్ కౌంటీలోగల క్రోస్ గ్రోవ్ వనంలో అతడి మృతదేహాన్ని గుర్తించినట్టు కౌంటీ కరోనర్ జస్టిన్ బ్రమ్మెట్ ఓ ప్రకటనలో తెలిపారు. 

పర్‌డ్యూ యూనివర్సిటీ పత్రిక ప్రకారం, సమీర్ కామత్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో డాక్టోరల్ విద్యార్థిగా ఉన్నారు. మాసాచుసెట్స్‌కు చెందిన అతడు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్రెస్ట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాడు. 2021లో పర్‌డ్యూ యూనివర్సిటీలో చేరిన అతడు మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు. 2025లో అతడి డాక్టోరల్ చదువు కూడా పూర్తి కావాల్సి ఉంది. మరోవైపు, ఘటన వెనుక కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకూ ఐదుగురు భారతీయ విద్యార్థులు మరణించగా ఈ వారంలో ఇది మూడో ఘటన. ఇటీవలే లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి ఒహాయోలోని సిన్సినాటీలో మరణించారు. అతడి మరణానికి కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. అంతకుముందు వారం రోజుల వ్యవధిలోనే మరో ఇద్దరు భారతీయ విద్యార్థులు వివేక్ సైనీ, నీల్ ఆచార్య మరణాలు కలకలం రేపాయి. జనవరి 30న పర్‌డ్యూ కాంపస్‌లో నీల్ ఆచార్య మృతదేహాన్ని గుర్తించగా, జార్జియాలోని లిథోనియా ప్రాంతంలో వివేక్ సైనీని దారుణంగా చంపేశారు. జనవరి 20న అకుల్ ధవన్ అనే భారతీయ విద్యార్థి మృతదేహాన్ని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయి సమీపంలో గుర్తించారు.

More Telugu News